ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్రాంచ్ (ఎస్ఈబీ) స్టేషన్ రణరంగంగా మారింది. తమ అక్రమ వసూళ్ల గురించి పత్రికలు, ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నారంటూ.. రెండు వర్గాల సిబ్బంది గొడవ పడ్డారు. స్టేషన్లోనే అరుచుకుని.. చెప్పులతో కొట్టుకున్నారు. ఎస్సై రఘును నిన్న బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ విషయాన్ని అధికారిక వాట్సప్ గ్రూప్లో పెట్టారు. తక్షణం మార్కాపురం ఎస్ఈబీ అధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించారు. తనకు రాతపూర్వకంగా ఆదేశాలు రాలేదంటూ.. ఆయన రిలీవ్ కావడం లేదు. స్టేషన్లో రహస్యాలు బయటకు వెళ్లడంపై సదరు ఎస్సై తన అనుకూల సిబ్బందితో హడావుడి చేయిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు.
అసలేం జరుగుతోంది..
ఇసుక అక్రమ రవాణా, నాటు సారా తయారీ సమాచారం తెలిస్తే చాలు.. ఎర్రగొండపాలెం ఎస్ఈబీ సిబ్బందిలో కొందరు వెంటనే వాలిపోతారని ఆరోపణలున్నాయి. కేసులు పెడతామని, బెయిల్ సైతం రాదని బెదిరింపులకు దిగుతారని స్థానికులంటున్నారు. పట్టుబడిన నిందితులు కాళ్లావేళ్లా పడితే.. మాట్లాడుకుందాం అంటూ హింట్ ఇచ్చి, బేరాలు మొదలుపెడతారని తెలుస్తోంది. స్టేషన్ పెద్దతో మాట్లాడుతానంటూ.. భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుని నిందితులను వదిలేయడం జరుగుతోందని వినికిడి. ఈ దందా కొద్ది రోజులుగా ఇక్కడ జరుగుతుండగా.. ఉన్నతాధికారుల హెచ్చరికలతోనూ చందా రాయుళ్లు మారలేదు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు బయటికి రావడంతో.. ఎస్సై రఘు సత్యనారాయణను ఎస్ఈబీ ఉన్నతాధికారులు బదిలీ చేశారు.
ఇవిగో ఉదాహరణలు...
ఎర్రగొండపాలెం పరిధిలోని ఓ గ్రామంలో నాటుసారా తయారీ కేంద్రంపై కొంతమంది కానిస్టేబుళ్లు ఇటీవల దాడి చేశారు. నాలుగు డ్రమ్ములతో ఉన్న సారాను గుర్తించి ఇద్దరు ముద్దాయిలను అదుపులో తీసుకున్నారు. నిందితులను ప్రభుత్వ వాహనంలో కొంత దూరం వరకు తీసుకొచ్చారు. అనంతరం వారిపై కేసు పెట్టకుండా విడిచిపెట్టారు. సరకును సైతం సీజ్ చేయలేదు. కేసు పెట్టకుండా వదిలేయడానికి సుమారు రూ. 50 వేలు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మరో ఘటనలో.. ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న ఓ టిప్పర్ను ఎస్ఈబీ సిబ్బంది పట్టుకున్నారు. ఇక్కడా బేరాలు కుదుర్చుకుని వదిలేశారు. ఇదే విషయం పత్రికల్లోనూ వచ్చింది.
ఇదీ చదవండి: