ప్రకాశం జిల్లా చీరాల దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసులో నిందితుడైన చీరాల టూటౌన్ ఎస్సై విజయకుమార్పై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్లను కూడా జోడించింది పోలీసు శాఖ. ఈ మేరకు బుధవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఏడాది జులైలో చీరాలలోని థామస్పేటకు చెందిన కిరణ్కుమార్(26) అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఎస్సై విజయ్ కుమార్ కొట్టడం వల్లే అతను చనిపోయాడని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స్పష్టించిన ఈ కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసులో ఎస్సై విజయకుమార్పై మొదట కేవలం ఐపీసీ 324 సెక్షన్ కింద మాత్రమే కేసు నమోదు చేశారు. అయితే మృతుడు ఎస్సీ కావటంతో ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ల కింద కూడా కేసు పెట్టాలంటూ మృతుడి తండ్రి మోహన రావు పోలీసు ఉన్నతాధికారులను లిఖితపూర్వకంగా కోరారు. దీనిపై ఈ కేసు విచారణాధికారి డీఎస్పీ బాలసుందరరావు సమగ్రంగా దర్యాప్తు జరిపి ఎస్సై విజయ్ కుమార్పై ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లను కూడా పెట్టాలంటూ సిఫార్సు చేశారు. ఈ క్రమంలో చీరాల టూటౌన్ సీఐ రోశయ్య అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.