Formula E Racing: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభమైంది. స్ట్రీట్ సర్క్యూట్పై స్పోర్ట్స్ కార్లు రయ్.. రయ్ మంటూ పరుగులు తీశాయి. రేసింగ్కి ముందు ట్రయల్ రన్ నిర్వహించారు. క్వాలిఫైయింగ్ 1, 2 తర్వాత రేస్ 1 స్పిన్ట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 3.10 గంటల నుంచి 3.20 గంటల వరకు క్వాలిఫయింగ్-1 డ్రైవర్ ఏ బృందం, 3.30 నుంచి 3.40 నిమిషాల వరకు క్వాలిఫయింగ్-2 బి బృందం రేస్ ప్రారంభించింది. సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు మెయిన్ రేస్ జరిగింది.
2023 ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్ రేస్ ప్రిపరేషన్లో భాగంగా ఇవాళ, రేపు ఇండియన్ రేసింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ పెట్రోల్ కార్లతోనే రేస్ నిర్వహించారు. ఈ రేసింగ్లో 12 కార్లు, 6 బృందాలు, నలుగురు డ్రైవర్లు, మహిళా రేసర్లు పాల్గొన్నారు. 50శాతం దేశంలోని రేసర్లు, మరో 50శాతం విదేశీ రేసర్లు ఇండియన్ రేసింగ్ లీగ్లో పాల్గొన్నారు. పెట్రోల్ కార్లు 240కి.మీ స్పీడ్తో వెళ్లాయని, ఎలక్ట్రిక్ కార్లయితే గరిష్ఠ వేగం 320 కి.మీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
తరలి వచ్చిన అభిమానులు: రేసింగ్ను వీక్షించడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. నిర్వాహకులు కూడా ప్రేక్షకుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 7,500 టికెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు తెలిపారు. ఈ రేసింగ్లో మొత్తం 18 మూలమలుపులు ఉన్నాయి. ప్రతి మూలమలుపు వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందించడానికి, ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా అంబులెన్స్ను కూడా సిద్ధంగా ఉంచారు. మంత్రి కేటీఆర్ ఐమాక్స్ వద్ద ప్రేక్షకులతో పాటు నిల్చుని రేసింగ్ను వీక్షించారు. హైదరాబాద్, బెంగళూరు, గోవా, చెన్నై, కొచ్చి బృందాలు రేసింగ్లో పాల్గొన్నాయి.
నెక్లెస్రోడ్లో సోమవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు: ఇండియన్ రేసింగ్ లీగ్ సందర్భంగా నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ నుంచి ఐమ్యాక్స్, ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్ మీదుగా ఈ ట్రాక్ తిరిగి ఐమ్యాక్స్ దగ్గర ఉన్న గ్యారేజీకి చేరుకుంటుంది. ఖైరతాబాద్ కూడలి నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లడానికి అనుమతి లేదు. ఈ రూట్ నుంచి వచ్చే వాహనాలను పీజేఆర్ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు మళ్లించారు.
అలాగే బుద్ధ భవన్.. నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్, ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు. రసూల్ పురా, మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం వైపు మళ్లించారు. బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ – రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. సోమవారం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
ఇవీ చదవండి: