నెల్లూరు జిల్లాలో సుమారు 2, 3 వేల మంది డయాలసిస్ రోగుల వరకు ఉన్నారు. వీరు వారానికి లేదా పక్షం రోజులకు ఓ మారు వైద్యుల సలహా అనుసరించి ఆసుపత్రికి వచ్చి డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయి. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరణ, దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో వ్యవస్థలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఆటోలు, బస్సుల నుంచి రైళ్ల వరకు అన్నింటినీ నిలిపేసిన కారణంగా రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.
ప్రయాణమే సమస్య
ఆసుపత్రుల్లో సేవలు అందుబాటులో ఉంచామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నా.. ప్రస్తుతం ప్రయాణమే ప్రధాన సమస్యగా మారింది. ద్విచక్రవాహనాలపై రావడానికి అనుమతి లేకపోవడం, ఆటోలకు వీలు కల్పించని క్రమంలో రోగులకు ఇబ్బంది ఎదురవుతోంది. కొందరు 2 నుంచి 3 రోజులకు ఓ సారి ఆసుపత్రికి రావాల్సిన క్రమంలో వారి వ్యథ వర్ణనాతీతంగా మారింది. 108 వాహనాలకు సమాచారం అందిస్తే డయాలసిస్కు తీసుకొస్తారని అధికారులు చెబుతున్నా.. అది మాటలకే పరిమితమైందని రోగులు వాపోతున్నారు.
జిల్లాలో డయాలసిస్ రోగులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని డీసీహెచ్ఎస్ అన్నారు. రవాణాపరంగా సమస్యలు ఉన్నట్లయితే 108 వాహనాలను వినియోగించుకోవడానికి అవకాశం కల్పించామని సుబ్బారావు తెలిపారు.
ఇదీ చూడండి: