నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ కరోనా బాధితురాలికి.. ఆక్సిజన్ పడక దొరక్క ప్రాణాలు విడిచింది. పట్టణంలోని జేఆర్ పేటకు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది రావటంతో.. 108 వాహనంలో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆక్సిజన్ బెడ్లు లేవనీ.. నెల్లూరు తీసుకువెళ్లాలని ఆసుపత్రి అధికారులు సూచించారు. దీంతో ఆత్మకూరులో ఉన్న రెండు ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకువెళ్లినా.. వారు కూడా చేర్చుకోలేదు. ఆత్మకూరులోనే సుమారు రెండు గంటలకు పైగా నిరీక్షించి.. చివరకు నెల్లూరుకు ప్రయాణమయ్యారు.
నెల్లూరు ఆసుపత్రిలో సైతం ఆక్సిజన్ బెడ్లు లేకపోవటంతో.. ఆక్సిజన్ అందక 108లోనే బాధితురాలు ప్రాణాలు వదిలింది. సుమారు నాలుగు గంటల పాటు బాధితురాలు.. ఊపిరాడక నరకయాతన అనుభవించిందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ విషయం తెలిసిన ఆత్మకూరు ఆర్డీవో చైత్ర వర్షిణి హుటాహుటిన.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను పరిశీలించారు. మరికొన్ని అదనపు బెడ్లను ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు.
స్వయాన మంత్రి నియోజకవర్గంలో ఇటువంటి సంఘటన జరగటంతో.. ఆత్మకూరు పట్టణంలో సరైన వైద్యం అందించటం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్లో మంత్రి అనిల్ ఆకస్మిక తనిఖీలు