కరోనా కారణంగా మూతబడ్డ పాఠశాలలు తిరిగి ప్రారంభం కాకపోవడం వల్ల 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారు. పట్టణాల్లో విద్యార్థులకు ఇది సౌకర్యవంతమే అయినా, పల్లెల్లో మాత్రం అవస్థలు తప్పడం లేదు. క్లాసులు వినడానికి విద్యార్థులు అవస్థలు పడుతున్న ఘటన కర్నూలు జిల్లా మద్దికెర మండలం బొజ్జనాయునిపేట గ్రామంలో వెలుగులోకి వచ్చింది. మొబైల్ నెట్వర్క్ లేనందున ఆన్లైన్ తరగతులు ప్రారంభం కాగానే కొందరు విద్యార్థులు పొలాల్లోని చెట్లపైకి ఎక్కి వినాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నెట్వర్క్ సిగ్నళ్లు రానందున తమకు, తమ పిల్లలకు కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికంగా నెట్వర్క్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. కరోనా కారణంగా ఆన్లైన్ తరగుతులు జరుగుతున్నందున విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారు. తరగతులు ప్రారంభం కాగానే పిల్లలు ఊరి చివర ఉన్న చెట్లు ఎక్కి మరీ క్లాసులు వింటున్నారు. ఈ క్రమంలో ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో అని చాలా భయంగా ఉంది. ఉపాధ్యాయులు అన్లైన్లో హాజరు వేయడానికి స్కూల్ భవనంపైకి వెళ్లాల్సిన పరిస్థితి. ఫోన్లో మాట్లాడే సమయంలో తరచూ అంతరాయం ఏర్పడుతుంది. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి. - నంది శాంతి రెడ్డి , గ్రామస్థుడు
ఇవీ చదవండి: జగన్ అక్రమాస్తుల కేసులో ఇక రోజువారీ విచారణ