కరోనా మహమ్మారి ప్రభావంతో నేతలన్న పరిస్థితి దయనీయంగా మారింది. కర్నూలు జిల్లా కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని పరిధిలో దాదాపు 40 వేల కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. సుమారు 15 వేల మగ్గాలపై సీకో, కాటన్ పెద్ద బార్డర్, టర్నింగ్ బార్డర్, మీనా వర్క్ వంటి 15రకాల చీరలు నేయడంలో ఇక్కడి నేతన్నలకు మంచి పేరుంది. పేరుకు గద్వాల చీరలైనప్పటికీ ఇక్కడ నేసే ఉత్పత్తులు... మాస్టర్ వీవర్స్ ద్వారా గద్వాల, విజయవాడ, రాజమహేంద్రవరం, ముంబై, కోల్కతా నగరాలకు తీసుకెళ్లి అమ్ముతుంటారు. గతంలో ఒక్కో చీరకు వేయి రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కార్మికునికి కూలీగా చెల్లించేవారు. ప్రస్తుతం..4 వందల నుంచి 6వందల రూపాయల వరకు తగ్గించి ఇస్తుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా లాక్డౌన్ తర్వాత ఇప్పటికే జిల్లాలో దాదాపు 4లక్షల వరకూ చీరలు కొనుగోళ్లు లేక పేరుకుపోయాయి. సుమారు 240 కోట్ల రూపాయల ఉత్పత్తులు ఇళ్లలోనే ఉండి పోవడంతో కొత్త చీరల తయారీపై ఆసక్తి చూపడం లేదు. కొత్తగా చీరలు నేయించేందుకు మాస్టర్ వీవర్స్ కూడా ముందుకురావడంలేదు. ఫలితంగా నేత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. అద్భుత నైపుణ్యాలతో వస్త్రాలు నేసే నేతన్నలు.. పనుల్లేక దీనస్థితిలో కాలం వెల్లదీస్తున్నారు.