ప్రగతి ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంలో దోపిడీ ఘటనలో నిందితులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి వినియోగించిన కర్రల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి తెచ్చారు.
ఈ మేరకు.. మహారాష్ట్రకు చెందిన వేణుగోపాల్... 20 యేళ్ల కిందట హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాడు. ట్రాన్స్ పోర్టు కంపెనీలో గుమస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత స్నేహితుడు సంతోష్ కుమార్ త్రిపాఠీకి చెందిన ప్రగతి ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంలో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేశాడు. అనంతరం అదే కార్యాలయంలో 40 శాతం వాటాతో పాటు నెల జీతం తీసుకున్నాడు. కొద్దికాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. హఠాత్తుగా వేణుకు సంతోష్ జీతం ఇవ్వటం మానేశాడు. అనారోగ్యంగా ఉండటం.. ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితుల్లో సంతోష్ పై వేణుగోపాల్ కక్ష పెంచుకున్నాడు. తన బంధువైన విశాల్ కు కష్టాలను చెప్పుకొన్నాడు. ట్రాన్స్ పోర్టు కార్యాలయంలో నగదు చోరీ చేసేందుకు విశాల్ మరో ఇద్దరితో కలిసి పథకం వేశాడు.
ట్రాన్స్ పోర్టు కార్యాలయంలోని సీసీ కెమెరాల పనితీరును తన చరవాణి నుంచి చూసే సౌకర్యం అంతకుముందే కలిగి ఉన్న వేణుగోపాల్.. ఆ ఆవకాశాన్నే ఆయుధంగా చేసుకున్నాడు. దోపిడీ చేసే రోజు ట్రాన్స్ పోర్టు కార్యాలయంలో ఏం జరుగుతుందో వేణుగోపాల్ ఫోన్ ద్వారా నిందితులకు చెప్పాడు. కార్యాలయంలో క్యాషియర్ ఒక్కడే ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాతే విశాల్, మాధవ్, సందీప్ లను లోనికి పంపాడు. పథకం ప్రకారం కర్రలతో క్యాషియర్ ప్రదీప్ పాండేపై దాడి చేసి మూడున్నర లక్షల నగదు దోచుకెళ్లారు. నిందితులు వేరే మార్గంలో పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు దాడి చేసిన కర్రలు, వినియోగించిన చెప్పుల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు. మూడున్నర లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.