రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేస్తూ గతేడాది డిసెంబర్ 31న ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు విచారించింది. ఈ మేరకు పిటిషనర్ల తరపు న్యాయవాదులు పీఎస్పీ సురేశ్ కుమార్, జంధ్యాల రవిశంకర్, వి. నాగార్జున బాబు వాదనలు వినిపించారు.
నిబంధనల ప్రకారమే విలీనం చేయాలి..
గ్రామాల్ని విలీనం చేయాలంటే పంచాయతీరాజ్, మున్సిపాలిటీ చట్టం నిబంధనల ప్రకారమే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పురపాలిక చట్టం నియమాల మేరకే ఆర్డినెన్స్ జారీ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీరాజ్ చట్ట నిబంధనలను సవరించలేదని వాదించారు. గ్రామ పంచాయతీల తీర్మానం లేకుండా, ఊరి ప్రజలను భాగస్వాములుగా చేయకుండా ఆర్డినెన్స్ తెచ్చారని కోర్టుకు విన్నవించారు.
పూర్తి స్థాయి విచారణ కోసం 20కి వాయిదా..
గ్రామాల విలీనంపై హైకోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు ఉండగా.. రాజధాని అమరావతి పరిధిలో భాగమైన పలు గ్రామాల్ని సమీప మున్సిపాలిటీల్లో కలిపారని న్యాయవాదులు వాదించారు. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం కిందకే వస్తుందన్నారు. గ్రామాల విలీనం విషయంలో ఆర్డినెన్స్ తెచ్చే శాసనాధికారం ప్రభుత్వానికి లేదని కోర్టుకు తెలిపారు. అనంతరం స్పందించన కోర్టు.. పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు ఈనెల 20కి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇవీ చూడండి : విశాఖ ఉక్కు: 2020-21 టర్నోవర్ రూ.18 వేల కోట్లు