Govt School Students Facing Problems: నాడు-నేడులో భాగంగా తమ పాఠశాల రూపురేఖలు మారిపోతాయని భావించిన ఆ పిల్లలకు, ఉపాధ్యాయులకు నిరాశే ఎదురవుతోంది. అదనపు భవనాలు నిర్మించేందుకు గుత్తేదారు కాంట్రాక్టు తీసుకున్నా.. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు పాఠశాల నూతన భవన నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. మొదలు పెట్టిన భవనాలు పూర్తికాక.. ఇరుకు గదుల మధ్య చదవలేక విద్యార్థులు అల్లాడిపోతున్నారు. నాడు-నేడులో భాగంగా కంకిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల అదనపు భవనాల కోసం నిధులు సైతం మంజూరయ్యాయి. 11 నెలల క్రితమే పనులు మొదలైనా.. ఇప్పటికీ పూర్తికాలేదని స్థానికులు అంటున్నారు. కరోనా సాకు చూపించి, గుత్తేదారు కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేవలం 30 నుంచి 35 శాతం పనులు మాత్రమే పూర్తి చేసి చేతులు దులుపుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఇలా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణానికి తెచ్చిన సామాగ్రిని నిర్లక్ష్యంగా వదిలేయటంతో విద్యార్థులు ఆడుకునే సమయంలో గాయాలకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కంకిపాడు జడ్పీ పాఠశాలలో మెుత్తం 400 మందికి పైగానే విద్యార్థులు చదువుతున్నారు. ఇంతమందికి సరిపడా గదులు లేనందున ఒక్కొక్క గదికి 60 నుంచి 70 విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. చాలీచాలని పాఠశాల గదుల్లో విద్యార్థులు చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు విద్యుత్ సరఫరా లేక చీకటిలోనే పాఠాలు వింటున్నారు. ఓ వైపు గదుల కొరత, మరోవైపు చీకట్లో చదువులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో అసౌకర్యాల కారణంగా కొందరు విద్యార్థులు మరో పాఠశాలలో చేరేందుకు టీసీలు తీసుకెళ్తున్నారంటే సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
కొద్దిరోజుల క్రితం ఈనాడులో వచ్చిన కథనంతో పనుల్లో కాస్త చలనం వచ్చింది. ఇప్పటికైనా పనులు త్వరగా పూర్తిచేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ చదవండి
chandrababu slams on cm jagan: ఓట్లేసిన పాపానికి.. ప్రాణాలే బలిగొంటారా ? : చంద్రబాబు