కృష్ణా జిల్లా పాతతిరువూరు భగత్సింగ్ నగర్కు చెందిన గాయం నాగమణి, కృష్ణ 3వ కుమార్తె అమూల్య. పది సంవత్సరాల క్రితం తప్పిపోయింది. మద్యానికి బానిసైన తండ్రి కృష్ణ భార్యతో గొడవపడి తన ముగ్గురు పిల్లల్ని వేర్వేరు చోట్ల వదిలేశాడు. అందులో ఇద్దరు పిల్లలు త్వరగానే తల్లిదండ్రుల్ని చేరినా.. అమూల్య ఇంటికి చేరేసరికి పదేళ్లు పట్టింది.
తండ్రి వదిలేసిన తర్వాత అమూల్యను ఎవరో మహిళ మచిలీపట్నంలోని బాల సదనంలో చేర్పించారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు మచిలీపట్నంలో చదువుకుని.. ఎనిమిదో తరగతి నుంచి ఏ కొండూరులో కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో చదివింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి వచ్చింది. మార్చి నుంచి లాక్ డౌన్ కారణంగా హాస్టల్ మూసివేశారు. కేజీబీవీ ఉపాధ్యాయిని రాజ్యలక్ష్మి తన ఇంటిలో అమూల్యకు ఆశ్రయం ఇచ్చారు. బుధవారం నాడు.. కామర్స్ ఉపాధ్యాయిని అనూరాధ తన ఇంటిలో ఉంచేందుకు తీసుకుని వస్తుండగా దారిలో ఆ పరిసరాలను గుర్తించిన బాలిక తన బాల్యంలో ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా చెప్పింది.
గురువారం ఉదయాన్నే అనురాధ భర్త కేశవరావు సదరు బాలికతో కలిసి ఆ ప్రాంతంలో ఆచూకీ తీసి వెతికారు. పాత తిరువూరు బాలుర హాస్టల్ పక్కన గల భగత్ సింగ్ నగర్లో నివాసం ఉంటున్న ఆమె తల్లి నాగమణి, సీతమ్మల నివాసం వద్దకు రాగానే.. వారు తమ కుమార్తెను గుర్తు పట్టి భావోద్వేగానికి గురయ్యారు. దశాబ్దం తర్వాత తమ బిడ్డ తిరిగి రావడంతో తల్లీ బిడ్డలు ఒకరినొకరు హత్తుకొని ఆనందానికి లోనయ్యారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి సదరు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. వారి ఆదేశాలను అనుసరించి కుటుంబం వద్దకు పంపుతామని తెలియచేశారు.
ఇదీ చదవండి: వచ్చే ఏప్రిల్ నుంచే విద్యుత్ నగదు బదిలీ అమలు