ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేసే నాథుడే లేదని.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరగూడెం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల వేదికగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని.. ప్రభుత్వ అధికారుల ప్రకటనలు కేవలం పత్రికలకు మాత్రమే పరిమితమయ్యాయని వాపోయారు. కృష్ణా జిల్లా గన్నవరం పరిసర ప్రాంతాల్లో.. దాళ్వాగా సుమారు 320 ఎకరాల్లో వేసిన వరి, జొన్న పంటను కొనుగోలు చేసే వారే కరువయ్యారని ఆవేదన చెందారు. అధికారులు చెప్పిన విధంగా ఎంటీయూ 1153వ రకం వరిని సాగుచేస్తే.. ప్రస్తుతం బియ్యం ముక్కలై, నూకగా మారుతుందని.. దీంతో ఎవ్వరు కొనుగోలు చేయడం లేదని తెలిపారు. దీనికి తోడు అకాల వర్షాలకు.. 15 రోజుల నుంచి ధాన్యాన్ని ఆరబెట్టటం, పట్టాలు కప్పడమే తమకు సరిపోతుందన్నారు.
కూలీల కొరత వేధిస్తోంది
మరోవైపు జొన్న పంట కోతకొచ్చినా.. పెరుగుతున్న కరోనా ఉద్ధృతికి కూలీల కొరత వేధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా.. గతేడాది కొనుగోలు చేసిన ధాన్యానికే ప్రభుత్వం నగదు చెల్లించలేదని తెలిపారు. అధికారులు సకాలంలో పంట కొనుగోలు, నగదు చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: జలజీవన్ మిషన్ పనుల్లో నాణ్యతాలోపం.. నాసిరకంగా నల్లాలు