ప్రజలకు ఆదర్శవంతమైన సేవలందిస్తామన్న ప్రచారంతో విజయవాడ కేంద్రంగా 2012లో వీర్రాజు అనే వ్యక్తి కొంతమందితో కలిసి ఆదర్శ కోఆపరేటివ్ సొసైటీ పేరిట పరస్పర సహకార పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేశారు. తమ సహకార సంఘం ద్వారా రికరింగ్ డిపాజిట్లు, సేవింగ్ అకౌంట్స్, డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, సేవింగ్స్ అకౌంట్స్, టెర్మ్ డిపాజిట్లు, పాన్కార్డ్సు, ఐటీ రిటన్స్, కన్సల్టెన్సీ తదితర లావాదేవీలు నిర్వహిస్తామంటూ ప్రచారం చేశారు. మూడేళ్ల వ్యవధిలో డిపాజిట్ చేసిన మొత్తానికి రెట్టింపు చెల్లిస్తామంటూ మచిలీపట్నం, కూచిపూడి, నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేట, చందర్లపాడు, కృత్తివెన్ను, ముదినేపల్లి, మండవల్లి, గుడివాడ, ఉయ్యూరు, పామర్రు, ఘంటసాల, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లో శాఖలు ఏర్పాటు చేశారు. ప్రతి బ్రాంచి పరిధిలో స్థానికంగా ప్రజల్లో పట్టున్న వ్యక్తులను డెవలప్మెంట్ అధికారి (డీవో)గా.. వారి కింద పనిచేసే విధంగా పలువురు ఏజెంట్లను, నగదు అధికారులను నియమించుకున్నారు. కొన్నాళ్ల పాటు సేవలు సజావుగానే ఉండటంతో ఖాతాదారుల్లో నమ్మకం పెరిగి పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు చేశారు.
బ్రాంచీల మూసివేతతో గందరగోళం
దాదాపు ఏడాదిన్నరగా మెచ్యూరిటీ డిపాజిట్లకు తిరిగి చెల్లింపుల విషయంలో ఆలస్యమవుతుండటం ..గడచిన ఆరు నెలలుగా జిల్లాలోని ఒక్కో బ్రాంచికి క్రమేపీ తాళాలు పడుతుండటంతో ఆయా శాఖల్లో పనిచేసే డీవోలు, ఇతర సిబ్బందితో పాటు ఖాతాదారుల్లో కలవరం ప్రారంభమయ్యింది. డిపాజిట్దారుల ఒత్తిళ్లు తట్టుకోలేని డీవోలు సంస్థ యాజమాన్యాన్ని ప్రశ్నించినా సరైన సమాధానం రాకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. కూచిపూడిలో 2014లో ఏర్పాటు చేసిన ఆదర్శ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో రూ.1.05 కోట్ల వరకూ డిపాజిట్లు కట్టించారు. ప్రారంభంలో డిపాజిట్ చేసిన వారికి నిర్ధిష్ట సమయం పూర్తయ్యాక కొందరికి నగదు సక్రమంగానే చెల్లించారు. సొసైటీ పట్ల నమ్మకం పెంచుకున్న పలువురు తమ సన్నిహితులతో కూడా డిపాజిట్లు వేయించారు. ప్రస్తుతం డిపాజిట్ల కాలపరిమితి గడువు దాటినా నగదు ఇవ్వకుండా జాప్యం చేయడంతో సొసైటీలో డీవోగా పని చేస్తున్న తాతా పద్మపై డిపాజిట్దారులు ఒత్తిడి తేవటంతో ఆమె యాజమాన్యాన్ని సంప్రదించగా వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు. తాను, తన తరఫున ఏజెంట్లు రూ.కోటికి పైగా సంస్థలో డిపాజిట్ చేయించామని, సమయం దాటిన బాండ్లకు నగదు చెల్లించకుండా బ్రాంచి మూసివేశారంటూ ఫిర్యాదు చేయడంతో ఈనెల 10న కూచిపూడి పోలీస్ స్టేషన్లో సదరు సంస్థపై కేసు నమోదయ్యింది.
రూ.20 కోట్లకుపైనే డిపాజిట్లు
జిల్లాలోని ఇతర శాఖల పరిధిలో కూడా డిపాజిట్లు చేసిన పలువురు ఖాతాదారులు శాఖ కార్యాలయాలకు తాళాలు వేసి ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద కృష్ణా జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్ల పైనే డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన సంస్థకు పొరుగు జిల్లాల్లో కూడా శాఖలున్నట్లు సమాచారం. కూచిపూడి స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఖాతాదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్బాబు ఆదేశాల మేరకు జిల్లాలోని మిగిలిన బ్రాంచీల్లో కార్యకలాపాలపై దర్యాప్తు నిర్వహిస్తున్న పోలీసులు రికార్డులను సైతం స్వాధీనం చేసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఇదీచదవండి