గుంటూరు జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. మందుల దుకాణాలకు తప్ప వేటికీ అధికారులు అనుమతివ్వలేదు. నిత్యావసరాలు, పాలు, కూరగాయల దుకాణాలనూ ఇవాళ మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. సామూహిక ప్రార్థనలను అనుమతించేది లేదంటూ ఇప్పటికే యంత్రాంగం ఆదేశాలు ఇవ్వగా..ఈస్టర్ ప్రార్థనలు ఇళ్ల వద్దే జరుపుకున్నారు.
జిల్లాలో ఇప్పటివరకూ 75 కేసులు నమోదు కాగా.. గుంటూరు అర్బన్ పరిధిలోనే 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పు నియోజకవర్గంలోని కుమ్మరిబజారు ప్రాంతంలో ఒకే ఇంటిలో 10 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో కంటైన్మెంట్ జోన్లలో అధికారులు, పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దిల్లీ వెళ్లివచ్చిన 9 మంది నుంచి.. 53 మంది వైరస్ బారినపడ్డారు. వీరిని కలిసిన వారిని ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పరీక్షలకు పంపారు.
గుంటూరు గ్రామీణ పరిధిలో ఇంతవరకూ 19 మంది వైరస్ బారినపడగా ఇద్దరు మృతి చెందారు. వీరిలో ముగ్గురు.. ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకపోవటం వల్ల వైరస్ ఎలా వ్యాపించిందనే అంశంపై ఆరా తీస్తున్నారు. లాక్డౌన్ పక్కాగా అమలు చేసేందుకు ఎక్కడికక్కడే బ్యారికేడ్లు, చెక్పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఎవరైనా అనవసరంగా రహదార్లపైకి వస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరికలు జారీ చేశారు. రెడ్జోన్లతోపాటు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరేట్ ద్రావణాన్ని రహదార్లపై పిచికారి చేస్తున్నారు.
పిడుగురాళ్లలో ప్రజలను రోడ్లపై రానివ్వకుండా రోడ్లపై భారీస్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు అన్ని దారులు మూసివేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా కేసులు 405... ఆ రెండు జిల్లాల్లోనే 157