తీవ్ర దుమారం రేపిన గుంటూరు జిల్లా పెదకాకాని శివాలయంలో మాంసాహారం వివాదంపై స్థానిక సీఐ స్పందించారు. ఆలయంలో మాంసాహారం వండిన ఆధారాలు లభించలేదని తెలిపారు. మాంసాహారం వండిన పాత్రలు మాత్రం గుడిలో ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై లీజుదారుడు మణికంఠ, మరో వ్యక్తి షరీఫ్పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో మెుత్తం ఐదుగురికి నోటీసులు ఇచ్చామని అన్నారు.
"ఆలయంలో మాంసాహారం వండిన ఆధారాలు లభించలేదు. మాంసాహారం వండిన పాత్రలు గుడిలో ఉన్నట్లు గుర్తించాం. లీజుదారుడు మణికంఠ, మరో వ్యక్తి షరీఫ్పైనా కేసు నమోదు. కేసులో ఐదుగురికి నోటీసులు ఇచ్చాం." -సురేశ్బాబు, పెదకాకాని సీఐ
వివాదం ఏంటంటే..: పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో క్యాంటీన్ నిర్వహణను ఓ ప్రైవేటు వ్యక్తి వేలం పాటలో దక్కించుకున్నాడు. అయితే అధికార పార్టీకి చెందిన సదరు నేతకు క్యాటరింగ్ వ్యాపారం కూడా ఉంది. తనకు వచ్చిన ఆర్డర్లను ఇక్కడే వండి సరఫరా చేస్తుంటాడు. ఇదే క్రమంలో ఈనెల 7న ఆలయం ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్లోనే మాంసాహారం తయారు చేయించి బయటకు పంపించారు. భక్తుల్లో ఒకరు ఇది గమనించి ఫొటోలు తీశారు. విషయం ఆలయ అధికారుల దృష్టికి రాగా.. క్యాంటీన్ నిర్వాహకులను పిలిచి వివరణ అడిగినట్టు సమాచారం. అయితే మాంసాహారం బయటే వండానని.., ఆర్డర్ ఇచ్చే వారికి అందజేసే క్రమంలో మాంసాహారం ఉన్న రిక్షా లోపలికి వచ్చిందని సదరు లీజుదారుడు అధికారులకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆలయ వర్గాలతో పాటు స్థానికులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై విమర్శలు తీవ్రస్థాయిలో రావడంతో దేవాదాయ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆలయంలోని క్యాంటీన్ను సీజ్ చేశారు.
పెద్ద ఎత్తున ఆందోళన: పెదకాకాని దేవస్థానం క్యాంటీన్లో మాంసాహారం తయారు చేసిన కాంట్రాక్టర్పై సరైన చర్యలు తీసుకోలేదంటూ తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈనెల 11న "చలో పెదకాకాని" పేరిట నిరసన చేపట్టారు. ఆలయానికి బయల్దేరిన ధూళిపాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన ధూళిపాళ్ల.. ఈవో అందుబాటులో లేకపోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: Dhulipalla Narendra: పెదకాకాని క్యాంటీన్ వ్యవహారం.. తెదేపా నేత ధూళిపాళ్లపై కేసు నమోదు