మిర్చి అమ్మిన డబ్బు ఇవ్వలేదనే కోపంతో శీతల గిడ్డంగి మేనేజర్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగిందీ ఘటన. మంటలు రావడం గమనించిన తోటి సిబ్బంది.. బాధితుడు శివకృష్ణను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. శరీరంలోని కొన్ని భాగాలు స్వల్పంగా కాలినట్లు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన గరికపాటి శివకృష్ణ ఏడేళ్లుగా ఓ శీతల గిడ్డంగిలో పనిచేస్తున్నాడు. రైతులు, చిన్న వ్యాపారుల వద్ద మిర్చి కొని, గ్రేడింగ్ చేసి.. ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తుంటాడు. ఈనెల 1వ తేదీన 'సాయిరాం చిల్లీస్ ట్రేడర్స్'కి చెందిన ఆంద్ర శ్రీనివాసరావు దగ్గర రూ. 5 లక్షల 80 వేల సరుకు కొన్నాడు. 14 రోజుల్లో నగదు చెల్లిస్తానని చెప్పాడు. గడువు తీరిన వెంటనే వెళ్లి అడగ్గా.. కొవిడ్ కారణంగా రవాణాలో జాప్యం జరిగిందని బాధితుడు తెలిపాడు. మరో వారంలో నగదు చెల్లిస్తానని స్పష్టం చేశాడు. కోపంతో ఊగిపోయిన నిందితుడు.. మేనేజర్తో వాగ్వాదానికి దిగాడు. ద్విచక్ర వాహనం నుంచి పెట్రోల్ తీసి.. గదిలో కూర్చున్న శివకృష్ణపై పోసి నిప్పంటించాడు. తోటి సిబ్బంది సకాలంలో స్పందించడంతో.. పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: