గుంటూరు సంగడిగుంట కొత్తరెడ్డి పేటకు చెందిన దాసరి కోటేశ్వరరావు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు దగ్గరకు రానివ్వలేదు. నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద భిక్షాటన చేసుకుంటూ అక్కడే బతుకుతున్నాడు. గత శనివారం రాత్రి ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురిసింది ఈ వర్షంలో కోటేశ్వరరావు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న మురుగు కాలువలో పడిపోయారు. స్థానికులు గమనించి పురపాలకశాఖ అధికారులకు సమాచారం అందించారు.
మురుగు కాలువలో ఉన్న వ్యక్తిని బయటకు తీసి నేలపై పడుకోబెట్టారు. కరోనా కారణంగా దగ్గరకు వెళ్లలేదు. వైద్యం అందక చివరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ... కోటేశ్వరరావు మృతి చెందాడు. ఆయన మృతి చెందినట్లు స్థానికులు మరోసారి పోలీసులకు సమాచారం చేరవేశారు పోలీసులు వచ్చి అతని జేబులో పరిశీలించడంతో ఆధార్ కార్డు దొరికింది. దాని ఆధారంగా అతని సమాచారాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లారు.