Electricity Employees Discussions Success: విద్యుత్ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పీఆర్సీపై ఉద్యోగులకు, ప్రభుత్వానికి అంగీకారం కుదిరింది. విద్యుత్ ఉద్యోగులకు 15 శాతం ఫిట్ మెంట్ కోరగా.. ప్రభుత్వం 8 శాతం ఇచ్చేందుకు అంగీకరించింది. దీనికి ఉద్యోగులు కూడా సమ్మతించడంతో.. ఒప్పందంపై యాజమాన్యంతో పాటుగా ఉద్యోగ సంఘాల నేతలు కూడా సంతకాలు చేశారు. మాస్టర్ స్కేల్ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు సబ్ కమిటీ ఆమోదించింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె నోటీసు ఉపసంహరించుకున్న ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది.
AP Electricity Employees JAC Withdraws Strike Notice: విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమిస్తున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసి ప్రకటించింది. సబ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలకు తాము పూర్తిస్థాయిలో సంతృప్తిగా లేమని జేఏసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. మేము కోరిన వాటిలో కొన్నింటిని ఇవ్వడానికి మాత్రమే ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఇంజినీర్స్ అసోసియేషన్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. విద్యుత్ జేఏసీగా ఆ అసోసియేషన్తో మాట్లాడతామని చెప్పారు. దేనిని తెగే వరకూ లాగకూడదని సమ్మె విరమించాల్సి వచ్చిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల ఎవరూ సొంతంగా జీతాలు వేసుకోరని.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవల్సిందేనని అన్నారు.
Government Agrees to Give Fitment: వన్మాన్ కమిటీ సిఫార్సులు అమలు చేసేందుకు ప్రభుత్వం ఇంత వరకూ సమయం తీసుకుందని విద్యుత్ జెఏసి కన్వీనర్ సాయి కృష్ణ పేర్కొన్నారు. 2018 ప్లస్పే స్కేల్ ఇచ్చేందుకు అంగీకరించామన్నారు. మాస్టర్ స్కేల్ 2.6 లక్షలు ఇచ్చేందుకు అలాగే 8 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. నోటీసు ఇచ్చిన డిమాండ్ల ప్రకారం కొన్ని పరిష్కారం అయ్యాయని.. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం చెప్పిన వాటికి అంగీకారం తెలియజేశామన్నారు. అందుకే సమ్మె విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చర్చలపై పూర్తిస్థాయి సంతృప్తి లేదని.. పాక్షికంగానే ప్రభుత్వం చెప్పిన అంశాలకు అంగీకారం తెలిపామని స్పష్టం చేశారు.
Minister Peddireddy Said Discussions are Successful: విద్యుత్ ఉద్యోగులతో చేసిన చర్చలు సఫలం అయ్యాయని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని కోరామన్నారు. వివిధ అంశాలపై ఒప్పందం కుదిరిందని.. ఎల్లుండి అగ్రిమెంట్ చేస్తామని వెల్లడించారు. ఫిట్ మెంట్ 8 శాతం ఇచ్చామన్నారు. ఒకటి రెండు ఇబ్బందులు ఉన్నా వాటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.