గుంటూరు జిల్లా బాపట్ల మత్స్యశాఖ ఎఫ్డీవో కార్యాలయ పరిధిలో అక్రమాలు జరిగాయని మత్స్యకారులు జేడీ, ఏడీలకు ఫిర్యాదు చేశారు. దీంతో జేడీ ఖాదర్వలీ, ఏడీ చంద్రశేఖర్ విచారణ చేపట్టారు. మండలంలో 22 వేట పడవలకు రిజిస్ట్రేషన్ చేయటానికి స్థానిక అధికారులు వెయ్యి నుంచి, 14 వందల రూపాయలు వసూలు చేసి అనుమతి సకాలంలో ఇవ్వలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన మర పడవల ఇంజిన్లు, వలలకు రాయితీ విడుదల చేయకపోవటంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జేడీ, ఏడీ ఆదర్శ నగర్లో ఉన్న మత్స్యశాఖ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు, మత్స్యకారులను విచారించారు. పడవలు రిజిస్ట్రేషన్ చేయకపోవటం వలన మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం 10 వేల చొప్పున మంజూరు చేసిన 10 లక్షల సాయం అందలేదని మత్స్యకారులు ఉన్నతాధికారులకు వివరించారు. స్థానిక మత్స్యకారుల సంఘం ఫిర్యాదు మేరకు ఇప్పటికే బాపట్ల ఎఫ్డీఓను మత్స్యశాఖను కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఈవో సస్పెండ్