గత ఏడాది కరోనాతో అన్నిరంగాలు ప్రభావితమయ్యాయి. విద్యారంగంపైన ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఎన్నడూ లేనివిధంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి గత ఏడాది ఎదురైంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదున్నర లక్షల నుంచి 6లక్షల మంది వరకు.. పదో తరగతి చదువుతున్నారు. కొన్నాళ్లు ఆన్లైన్ తరగతులు నడిచినప్పటికీ.. గత నవంబరు నెల నుంచి విద్యార్థులకు నేరుగా తరగతులను నిర్వహిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో.. జనవరి నాటికే సిలబస్ పూర్తిచేసి రివిజన్కు వెళ్లాల్సి ఉండగా..ప్రస్తుతం పాఠాలు పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. ఈ దృష్ట్యా ప్రభుత్వం పరీక్షలను జూన్ 7నుంచి నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు.. 30 శాతం పాఠ్యాంశాలను తగ్గించారు. పరీక్షలకు జూన్ వరకు సమయం ఉన్నందున.. ఈ లోగా సిలబస్ను పూర్తి చేస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
కరోనా వల్ల చాలా ప్రైవేట్ స్కూళ్లలో ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయారు. ఫలితంగా సబ్జెక్ట్ నిపుణుల కొరత ఏర్పడింది. చాలా పాఠశాలల్లో మ్యాథ్స్, సైన్స్, హిందీ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాసరూపంలో ప్రశ్నలు కాకుండా బిట్ల రూపంలో ప్రశ్నాపత్రాలు ఇవ్వడం వల్ల విద్యార్థులు కొంతమేర ఒత్తిడి నుంచి బయటపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
కరోనా ప్రభావంతో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడిన తరుణంలో.. పదో తరగతి విద్యార్థులపై పరీక్ష ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ పరీక్షలో అక్రమాలు.. స్క్రీన్షాట్లతో జవాబులు