ఓవైపు మృతదేహం బరువు... మరోవైపు వర్షం కారణంగా బురదమయంగా మారిన పొలం గట్లు. శవంతో పాటే ఎక్కడ జారిపడతారేమో అనే భయం. శ్మశానానికి వెళ్లేందుకు వేరే దారి లేక... ఏళ్ల తరబడి ఆ గ్రామస్తులు నరకాన్ని చూస్తున్నారు. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఎర్రబాలెం గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న నరకయాతన ఇది. పూర్వం గ్రామానికి చెందిన కొందరు దాతలు శ్మశానానికి భూమి విరాళంగా ఇచ్చారు. అప్పటినుంచి ఆ స్థలంలోనే దహన సంస్కారాలు నిర్వహించేవారు.
అప్పట్లో మెట్టుభూమి కావడం కారణంగా ఎవరూ దానిపై దృష్టి పెట్టలేదు. కాలక్రమేణా ఈ భూమి మాగాణిగా మారడంతో ఒక్కసారిగా విలువ పెరిగింది. శ్మశానానికి సంబంధించిన భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. కొంత భూమిని తమ పొలంలో కలిపేసుకుని సాగు చేసుకుంటున్నారు. ఇక శ్మశానానికి కొద్దిపాటి స్థలమే మిగిలింది. శ్మశానానికి వెళ్లే దారులూ మూసుకుపోయాయి. ఆక్రమణలు తొలగించాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
గతంలో ఈ శ్మశానానికి భూములు విరాళంగా ఇచ్చారు గాని... వాటిని రికార్డుల్లోకి నమోదు చేయకపోవడం కారణంగా ఈ సమస్య ఎదురైంది. ఇటీవల గ్రామానికి చెందిన కొలగాని భగవతమ్మ అనే వృద్ధురాలు మృతి చెందగా.... ఆమె దహన సంస్కారానికి బంధువులు పడ్డ పాట్లు వైరల్ అయ్యాయి. శ్మశానంలో అంత్యక్రియలకు చోటులేక... పొలం గట్లపైనే దహన సంస్కారాలు నిర్వహించారు. తాము అనుభవిస్తున్న కష్టాలపై అధికారులు స్పందించి... ఆక్రమణలకు గురైన భూమిని పరిరక్షించాలని ఎర్రబాలెం వాసులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండీ... నాడు వెలవెల... నేడు జలకళ