కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న బంద్లో భాగంగా గుంటూరులో ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. రాష్ట్రం ప్రభుత్వం బంద్కు మద్దతు ప్రకటించడంతో వాటిని ముందుగానే డిపోల్లో నిలిపేశారు. దూరప్రాంతాల నుంచి ఉదయాన్నే గుంటూరుకు చేరుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి వచ్చిన వాహనాల్ని ఉద్యమకారులు అడ్డుకున్నారు. హోటళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. బంద్ కారణంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ముందుగానే సెలవు ప్రకటించాయి.
![guntur bus stand](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11162731_guntur.jpg)
భారత్ బంద్లో భాగంగా వామపక్షాలు గుంటూరులో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ప్రదర్శన చేపట్టారు. అక్కడి నుంచి నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రమాదకరమని వామపక్ష నాయకులు విమర్శంచారు. గుజరాత్ కార్పొరేట్ శక్తుల చేతుల్లో దేశాన్ని పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆంధ్ర ప్రజలు పోరాడి, బలిదానాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అన్నివర్గాల వారు పెద్ద ఎత్తున బంద్లో పాల్గొన్నారు.
చోద్యం చూస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం: తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్
కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. భారత్ బంద్కు మద్దతుగా గుంటూరులో తెదేపా చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. గుంటూరు తెదేపా కార్యాలయం నుంచి శంకర్ విలాస్ కూడలి వరకూ ర్యాలీ నిర్వహించి.. అక్కడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఇపుడు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని నౌకాశ్రయాలు అన్నింటినీ ప్రైవేటు వారికి అప్పగిస్తోంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు.
ఎంపీలంతా రాజీనామా చేయాలి: పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
![guntur congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11162731_congress.jpg)
ఏపీలోని ఎంపీలు అందరూ రాజీనామా చేసి.. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి డిమాండ్ చేశారు. భారత్ బంద్లో భాగంగా గుంటూరు హిందూ కళాశాల కూడలి వద్ద మనవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ప్రవేటీకరణ చేయడమే లక్ష్యంగా భాజపా ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం జగన్, ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.
స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసిన వ్యాపారులు..
నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ అఖిల పక్షాలు వినుకొండలో నేడు బంద్కు పిలునిచ్చాయి. దేశవ్యాప్తంగా 12 గంటల పాటు జరగనున్న ఈ బంద్లో భాగంగా బంద్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నేడు బంద్కు మద్దుతు తెలిపాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 2గంటల వరకు ఈ బంద్ కొనసాగుతుంది. పట్టణంలోని వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు.
నరసరావుపేటలో విద్యాసంస్థలు, బ్యాంకులు మూసివేత..
![naarasarao peta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11162731_narasarao-peata.jpg)
దేశవ్యాప్తంగా శుక్రవారం నిర్వహిస్తున్న భారత్ బంద్కు నరసరావుపేటలోని తెదేపా, అఖిలపక్ష నేతలు మద్దతు తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలు, విశాఖ ఉక్కు ప్రవేటీకరణ నిర్ణయాలను కేంద్రం వెంటనే వెనక్కు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురాలలో బంద్ ప్రశాంతం
గుంటూరు జిల్లా తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో తెదేపా, వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ జరిగింది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని నేతలు అన్నారు. కొత్తగా తీసుకొచ్చిన రైతు చట్టాల వలన రైతులకు ఎంతో నష్టం జరుగుతుందని విమర్శించారు. నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
మోదీకి గుణపాఠం చెబుతాం..
![mangalagiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11162731_mangal.jpg)
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు, కార్మిక సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన భారత్ బంద్ మంగళగిరిలో ప్రశాంతంగా ముగిసింది. వామపక్షాలు, వ్యవసాయ సంఘం నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు మంగళగిరిలో ర్యాలీ నిర్వహించాయి. దుకాణాలను మూయించారు. బస్టాండ్ కూడలిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెబుతామని నేతలు ప్రకటించారు.
దేశవ్యాప్త ఆందోళనలు చేపడతాం..
![chilakaluripeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-gnt-76-26-chilakaluripet-lo-prasamtamga-bharat-bandh-av-ap10027-spot_26032021130901_2603f_1616744341_431.jpg)
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది. అఖిలపక్షం, రైతు సంఘాలు, ప్రజా సంఘాల, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దగ్గరుండి దుకాణాలను మూయించారు. వ్యవసాయ నల్ల చట్టాలను, కేంద్ర విద్యుత్ బిల్లును రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి.
ఇదీ చదవండి:
2వ దశ కొవిడ్పై తెనాలి ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రణాళికలు..