తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధి అంటే తిరుపతి తరువాత అంతటి పవిత్రమైన క్షేత్రంగా పేరు పొందింది. ఇక్కడ వివాహాలు చేసుకుంటే వారి జీవితాలు సుఖ సంతోషాలతో ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే తిరుమల తర్వాత అత్యధిక వివాహాలు ఇక్కడే జరుగుతాయి. స్వామి సన్నిధిలో వివాహం చేసుకోలేని వారు.. పెళ్లి బట్టల్లోనే ఇక్కడికి వచ్చి సత్య దేవుని వ్రతం ఆచరిస్తారు. ఇలా కూడా చేయలేని వారు వారి వివాహ శుభలేఖను హుండీలో వేస్తారు. ఇలా వేసిన వారికి 2016 నుంచి సత్యదేవుని శుభాశీస్సులతో తయారు చేసిన ప్రత్యేక కార్డు, స్వామికి పూజ చేసిన అక్షింతలు, కుంకుమను అధికారులు పంపేవారు. దీన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో భద్రపరుచుకునేవారు. అయితే ప్రస్తుతం వివిధ కారణాలను సాకుగా చూపించి శుభాశీస్సుల కార్డులను అధికారులు నిలిపివేశారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కార్డులో సారాంశాన్ని కొంత మార్పు చేయాలని, దాన్ని సరి చేసి భక్తులకు శుభాశీస్సుల కార్డులను పంపిస్తామని ఈవో త్రినాథరావు చెబుతున్నారు. కొత్తగా జీవితం ప్రారంభించబోయే వారికి ఎప్పటిలానే స్వామి వారి ఆశీస్సులను పంపిస్తే బాగుంటుందని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.
ఇవీ చూడండి: