కృష్ణా జిల్లాలో...
రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నందున జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు సూచనల మేరకు.. నందిగామ డీఎస్పీ జి.నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం మాస్కులు పంపిణీ చేశారు.
పామర్రు ఎన్టీఆర్ సర్కిల్లో మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వాహన చోదకులకు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, డీఎస్పీ సత్యానందం మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలంటూ పోలిసులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. కొవిడ్ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే.. మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పారు.
గన్నవరంలో కరోనా నిబంధనలపై పోలీసులు అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని, కరోనా వైరస్ పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించరాదని సూచించారు.
విజయవాడలో...
నగర పరిధిలో మాస్కులు లేకుండా ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నగరంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా వాహనదారులకు కొవిడ్ జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎస్ఐ జీ.సురేంద్ర అన్నారు. మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మాస్కు ధరించకపోతే జరిమానాలు విధించి, కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అనంతపురం జిల్లాలో...
మాస్కులు ధరించకుండా బయట తిరిగే వారికి ధర్మవరం పోలీసులు రూ.200 జరిమానా విధిస్తున్నారు. పట్టణంలో డీఎస్పీ రమాకాంత్, పట్టణ సీఐ కరుణాకర్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కూడళ్లలో పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, మాస్కు ధరించకుండా వాహనాలు నడిపే వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ చేస్తున్నారు. జరిమానా విధించిన అనంతరం పోలీసులు మాస్క్ అందజేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో..
కొవిడ్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మార్కాపురం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మాస్కులు లేకుండా బయటకు వస్తే జరిమానాలు విధిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొవిడ్ కేసులను కొంత మేరైనా నియంత్రించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీచదవండి.