తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు బిక్కవోలుకు చెందిన రాయుడు ప్రవర్త కుమార్కు చేపల చెరువుల నిర్వహణలో తీవ్ర నష్టాలు వచ్చాయి. అప్పులు తీర్చేందుకు తన వద్ద ఉన్న ఒక వ్యాన్ అమ్మినా నగదు సరిపోలేదు. ఫలితంగా అతని తండ్రి లక్ష్మీపతి రాజుతో కలిసి నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
పాత పరిచయంతో..
పాత పరిచయం ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన జాస్తి చక్రవర్తి, నూక వెంకటనారాయణ, రాజమహేంద్రవరానికి చెందిన సందిపర్తి చక్రవర్తి, అలజంగి పార్వతిలు కలుసుకుని నకిలీ కరెన్సీ నోట్లు తీసుకునివచ్చారు. బిక్కవోలులోని జంపా శ్రీనివాస్ అనే వ్యక్తికి బాకీ నిమిత్తం లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉండగా రూ. 500 రూపాయల నోట్ల కట్టలో 36 నకిలీ నోట్లు పెట్టి ఇచ్చారు.
నకిలీగా గుర్తింపు..
సదరు నగదును శ్రీనివాస్ బ్యాంకుకు తీసుకువెళ్లగా బ్యాంకు సిబ్బంది వాటిని నకిలీ నోట్లుగా గుర్తించారు. విషయాన్ని ప్రవర్త కుమార్కు చెప్పగా విషయం ఎక్కడ బయట పడుతుందోనని భయంతో తాను వ్యాన్ అమ్మగా వచ్చిన డబ్బు ఇచ్చానని ఏమీ తెలియనట్లుగా బిక్కవోలు ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
తండ్రి కొడుకులే ముద్దాయిలు..
దర్యాప్తులో భాగంగా తండ్రి కొడుకులే ముద్దాయిలని పోలీసులు గుర్తించారు. అనంతరం వీరికి నకిలీ కరెన్సీ నోట్లు ఇచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.69,000 నకిలీ కరెన్సీ నోట్లు, రూ. 36,000 ఒరిజినల్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నయీమ్ అస్మి వెల్లడించారు.