అధిక వర్షాలు, నివర్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు భరోసా ఇచ్చారు. రంగు మారిన ధాన్యాన్నీ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పి.గన్నవరం, ఆర్.ఏనుగుపల్లి, కే.ఏనుగుపల్లి, ముంగండ, ముంజవరం ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు.
ముమ్మిడివరం నియోజకవర్గంలో..
నివర్ తుపాను ప్రభావంతో.. తాళ్ళరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లోని వందలాది ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట నీటమునిగింది. వరదల కారణంగా ఇప్పటికే నష్టపోయిన రైతులను.. నివర్ నట్టేట ముంచింది. పంట కోసి ఉన్న పొలాల్లో నీరు చేరడంతో.. పనలు తేలియాడుతున్నాయి. గాలులకు పడిపోయిన చేలు.. గట్టున ఉన్న వరికుప్పలు తడిసి ముద్దయ్యాయి. రెండు, మూడు రోజులు ఇలాగే కొనసాగితే.. ఒక్క గింజా చేతికి అందదని రైతులు ఆందోళన చెందుతున్నారు. విపత్తుల వల్ల పంట నష్టపోతున్నా ప్రభుత్వం సాయం అందించడం లేదని.. కౌలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం పరిస్థితి:
ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో వేల ఎకరాల్లోని వరి, పత్తితో సహా అనేక ఇతర పంటలు.. నివర్ తుపాను తాకిడికి తీవ్రంగా దెబ్బ తిన్నాయి. కోతలు కోసిన, కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని రైతులు రోడ్డుపై ఆరపెడుతున్నారు. తడిసిన ధాన్యం ఎవరూ కొనరని రైతులు వాపోతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో.. వేల రూపాయలు పెట్టుబడి తుపాను పరమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
కాకినాడలో స్తంభించిన జనజీవనం:
కాకినాడలో పలు రోడ్లు, కాలనీలు.. తుపాను ధాటికి నీటమునిగాయి. గతంలో కురిసిన వర్షాలకు రోడ్లు ధ్వంసం కాగా.. ఆ గుంటల్లో నీరు చేరి వాహనచోదకులు ఇబ్బందులకు గురయ్యారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా నగరంలో చలి తీవ్రత పెరిగింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి కాకినాడ గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: