తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలంలోని పగడాలపేటకు చెందిన చిన్నారి సూరాడ దీప్తిశ్రీ ఇషానీ జగన్నాథపురంలోని నేతాజీ పాఠశాల ఆవరణ నుంచి బాలిక దీప్తిశ్రీ శుక్రవారం అపహరణకు గురై మూడు రోజులు గడుస్తున్నా కేసు కొలిక్కిరాలేదు. బాలిక నానమ్మ సూరాడ బేబీ, చిన నానమ్మ కుమారి, ఇతర కుటుంబ సభ్యులు చిన్నారి ఆచూకీ కోసం నిరీక్షిస్తూ కుమిలిపోతున్నారు. చిట్టితల్లి ఎక్కడుందో.. ఎప్పుడొస్తుందోనని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. బాలిక తండ్రి సత్యశ్యామ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా భావించిన బాలిక సవతితల్లి శాంతకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతోపాటు.. దర్యాప్తులో కోణాల ఆధారంగా మూడు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
‘ధర్మాడి’ బృందంతో గాలింపు..
బాలికను హతమార్చి గోనెసంచిలో కట్టి ఉంచారని.. బాలికను కాలువలో పడేశారని.. ఇలా భిన్న వాదనలు స్థానికంగా వినిపించాయి. వీటిని పోలీసులు ధ్రువీకరించలేదు. కానీ నగరంలోని ఇంద్రపాలెం లాకుల వద్ద ఉప్పుటేరు, మేడలైను కాలువలో ధర్మాడి సత్యం బృందంతో గాలింపు చర్యలు చేపట్టడం ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది. గాలింపు చర్యలు ఆదివారం రాత్రి వరకు సాగినా ఎలాంటి ఫలితం దక్కలేదు. మరోవైపు బాలిక చదువుతున్న జగన్నాథపురం, నేతాజీ నగరపాలక పాఠశాల వద్ద పోలీసులు జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. జగన్నాథపురం శివారు డంపింగ్ యార్డు వద్ద జాగిలాలు తనిఖీ చేశాయి. ఇక్కడా ఎలాంటి ఆధారం దొరకనట్లు తెలిసింది. బాలిక అపహరణకు గురైన రోజున జగన్నాథపురం, నేతాజీనగర్ ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఈ దృశ్యాల్లో ముసుగు వేసుకున్న ఓ మహిళ చిన్నారిని తీసుకుని వెళుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ మహిళ, చిన్నారి కుటుంబానికి చెందిన వారా కాదా అనేదానిపై ఆరా తీస్తున్నారు. వీరు నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు చిక్కినా వెనుక నుంచి నిక్షిప్తం కావడంతో ముఖాల జాడ కనిపించని పరిస్థితి నెలకొంది.
మూడు రోజులైనా..
ఈ కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులు, ఆటో డ్రైవర్లను విచారిస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల పాత్రపైనే ఎక్కువ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాలిక సవతితల్లి శాంతకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె నుంచి కీలకమైన సమాచారం రాబడుతున్నా.. అక్కడికి పోలీసులు వెళ్లి ఆరాతీస్తే ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిసింది.
కుటుంబ కోణంలో...
అపహరణకు గురైన దీప్తిశ్రీ ఇషానీ విషయంలో తండ్రి సత్యశ్యామ్కుమార్, అతని భార్య శాంతకుమారి తరచూ గొడవలు పడేవారన్నది స్థానికంగా వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలో బాలిక అపహరణకు గురవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కోణంలోనే తొలుత బాలిక సవతితల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి, ఇతర కుటుంబికులు, బంధువులనూ పోలీసులు విచారిస్తున్నారు.
హత్యకు గురైందని వస్తున్నవి వదంతులే..: డీఎస్పీ కుమార్
అపహరణకు గురైన ఏడేళ్ల బాలిక దీప్తిశ్రీ హత్యకు గురయిందని వస్తున్నవి వదంతులేనని కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ వెల్లడించారు. ఆదివారం రాత్రి కాకినాడలోని ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో విలేకర్ల సమావేశంలో ~రఆయన మాట్లాడారు. కేసు విచారణలో భాగంగా తమకు అందిన సమాచారం మేరకు ఉప్పుటేరుతోపాటు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానాలు ఉన్నాయని.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. త్వరలో వాస్తవాలు ఏమిటో వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. బాలిక సజీవంగా ఉందా..? ఇంకేమైనా జరిగిందా..? అని విలేకర్లు అడిగిన ప్రశ్నలకు.. దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏమీ కొలిక్కి రాలేదని వెల్లడించారు.
ఇదీ చూడండి: