రాష్ట్రంలో ఎస్సీలపై వరుసదాడుల చూస్తుంటే ప్రభుత్వం నమ్మకం పోతుందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. సీతానగరం ఎస్సీ వ్యక్తికి శిరోముండనం, రాజమహేంద్రవరంలో బాలిక అత్యాచారం, చీరాలలో ఎస్సై దాడిలో యువకుడి మృతి... ఈ ఘటనలు దేనికి నిదర్శనం అని నిలదీశారు. ఎస్సీ యువకుడిక్ శిరోముండనం చేసి జాతి ఆత్మగౌరవంపై దెబ్బకొట్టారని హర్షకుమార్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో బాలికపై సామూహిక అత్యాచారం చేసి, పోలీసు స్టేషన్ ముందే వదిలిపెట్టారన్నారు. పోలీస్స్టేషన్ వద్ద బాలికను పోలీసులు సైతం కొట్టారని హర్షకుమార్ అన్నారు. ఈ విషయాన్ని ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారని ఆరోపించారు. ముష్టి వేసినట్లు బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం చేశారన్నారు.
ఎస్సైపై చర్యలేవీ?
మాస్కు పెట్టుకోలేదని చీరాలలో ఎస్సీ యువకుడు కిరణ్ ను కొట్టి చంపారన్న హర్షకుమార్... కిరణ్ వైకాపా కార్యకర్తే కదా.. ఆయన ఏం నేరం చేశారని నిలదీశారు. జీపులో నుంచి దూకి పారిపోవాల్సిన అవసరం కిరణ్కు ఏముందని ప్రశ్నించారు. ఘటనకు కారకుడైన ఎస్సైపై 302 సెక్షన్ కింద కేసు పెట్టారని, ఓ వ్యక్తిని కొట్టి చంపితే పెట్టాల్సిన కేసు నమోదు చేయలేదని ఆరోపించారు.
రేపటిలోగా అరెస్టు చేయండి
వైకాపా ఇంత మెజార్టీతో అధికారంలో రావడానికి కారణమైన ఎస్సీలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మూడు ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. నిర్ణీత గడువులోగా న్యాయ విచారణ జరిగేలా చూడాలన్నారు. రేపు సాయంత్రంలోగా శిరోముండనం నిందితులను అరెస్టు చేయాలన్నారు.
ఇదీ చదవండి : గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారి.. రక్షించిన అగ్నిమాపక సిబ్బంది