తూర్పుగోదావరి జిల్లాలో పేదలకు గృహాలు, ఇళ్లపట్టాల పంపిణీకి చర్యలు ముమ్మరం అయ్యాయి. ఈ నెల 8న 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ పట్టణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీ టిడ్కో) నిర్మించిన ఇళ్లను మొదటిగా లబ్ధిదారులకు ఇచ్చి తరువాత మిగిలిన వారికి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా జిల్లాలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న 25,360 ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట, రామచంద్రపురం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, అమలాపురం వంటి ప్రాంతాల్లో ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఫేజ్-1లో 19,242, ఫేజ్-2లో 12,982, ఫేజ్-3లో 27,610 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు అన్ని మౌలిక వసతులతో 25,360 గృహాల నిర్మాణం పూర్తిచేశారు.
పూర్తయిన లబ్ధిదారుల ఎంపిక
జిల్లాలోని ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట వాటికి సరిపోయేలా లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే జరిగింది. గత ప్రభుత్వంలోనే కొంత మందికి వీటిని కేటాయింపులు చేసినప్పటికీ.. అనర్హులున్నారన్న ఆరోపణలతో కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్లీ సర్వే చేసి తుది జాబితాను సిద్ధం చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎంపికైన వారి నుంచి లబ్ధిదారుని వాటాగా కొంత నగదును డీడీ రూపంలో కట్టించుకున్నారు. వీరందరికీ ఈ నెల 8న ఇళ్లు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్ల సముదాయాల్లో ఇటీవలే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించారు. కొన్నిచోట్ల రక్షిత మంచినీటి ట్యాంకులు, ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం కొనసాగుతోంది. ఇలాంటి చోట్ల తాగునీరు ఇవ్వడానికి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యేవరకు ఆ ప్రాంతాల్లో వేసిన బోర్ల ద్వారా అపార్ట్మెంట్ల పైన నిర్మించిన ట్యాంకులకు నేరుగా నీళ్లు ఎక్కించి అక్కడి నుంచి ప్రజలకు సరఫరా చేయనున్నారు. ఎస్టీపీలు నిర్మాణం కానిచోట్ల సెప్టిక్ ట్యాంకుల ద్వారా పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నారు.
మిగిలిన నిర్మాణాలు వేగవంతం
'జిల్లాలో ఇప్పటికే పూర్తయిన 25,360 ఇళ్లను అధికారులకు అప్పగించాం. వీటికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. గృహ సముదాయాల్లో మౌలిక వసతులు దాదాపు పూర్తిచేశాం. కొన్నిచోట్ల మాత్రం మంచినీటి ట్యాంకులు, ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. 80 శాతం పనులు పూర్తవ్వగా 20శాతం చేయాల్సి ఉంది. లబ్ధిదారులు ఇళ్లల్లోకి వచ్చినా ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. జిల్లాకు మూడు ఫేజుల్లో కలిపి 59,834 ఇళ్లు మంజూరయ్యాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తున్నాం. '- శ్రీనివాస్, పర్యవేక్షక ఇంజినీరు, ఏపీటిడ్కో
ఇవీ చదవండి..