తోటలో మిర్చి, ఇతర కూరగాయలు కోసి మార్కెట్కు తెస్తేనే.. రైతు బజార్లలో వినియోగదారులకు అందుతాయి. గోదాముల్లో నిత్యావసరాలను లోడింగ్, అన్లోడింగ్ చేయాలన్నా హమాలీలు తప్పనిసరి. అయితే కరోనా నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్న కారణంగా.. ఇవన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోతున్నాయి. ఫలితంగా పట్టణాలకు నిత్యావసర వస్తువుల సరఫరాపై ప్రభావం పడుతోంది. ధరలు క్రమంగా పెరిగే ప్రమాదమూ ఏర్పడింది. మార్కెటింగ్ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ.. పంట ఉత్పత్తులకు రవాణా అనుమతులు ఇచ్చే దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు.
పనులకు రావొద్దని హెచ్చరిస్తున్నారు
రైతుల సమస్యలపై దృష్టి సారించిన సీఎం.. సామాజిక దూరం పాటిస్తూనే పంట కోతలకు వెళ్లే కూలీలను అనుమతించాలని అధికారులకు సూచించారు. కానీ.. క్షేత్రస్థాయిలో మిర్చి కోతలకు వెళ్లే కూలీలు రోడ్లమీదకు వస్తే పోలీసులు అనుమతించడం లేదు. కొన్ని మండలాల్లో అధికారులే పొలాల వద్దకెళ్లి.. పనులకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. దీంతో పంట కోసి మార్కెట్కు తరలించేదెలా అనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు గుంటూరు మిర్చి యార్డు మూసివేసిన కారణంగా.. మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదేశాలు ఉన్నప్పటికీ..
నిత్యావసరాల చట్ట పరిధిలోకి వచ్చే వాటిని అనుమతించాలని వ్యవసాయశాఖ కలెక్టర్లకు లేఖ రాశారు. చేపలు, రొయ్యలతో పాటు దాణా, విత్తన రొయ్యల తయారీ, రవాణా తదితరాలన్నీ నిత్యావసరాల పరిధిలోకి వస్తాయని కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖ రాసింది. వాటన్నింటిని అనుమతించాలని మత్స్యకార్యదర్శి సూచించారు. స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. అధికారుల మధ్య సమన్వయం ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. పంట ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేలా తగిన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చిత్తూరుతో పాటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పట్టుగూళ్ల మార్కెట్లో కోనుగోలు నిలిపివేసిన కారణంగా.. రైతులు ఇబ్బంది పడుతున్నారు. గూళ్లు సిద్ధమయ్యాక.. వాటిని స్టీమ్ చేయాలి. లేదంటే పురుగులు రంధ్రాలు చేసుకుని బయటకు వస్తాయని ప్రకాశం జిల్లా గిద్దలూరు రైతు ఆదినారాయణరెడ్డి వివరించారు. దీనితో గూళ్లు పనికిరాకుండా పోతాయని ఆవేదన వెలిబుచ్చారు. 8 క్వింటాళ్ల పట్టుగూళ్లను మార్కెట్కు తీసుకెళ్లేందుకు కమిషనర్ నుంచి అధికారిక పత్రం పొంది బుధవారం మదనపల్లికి బయల్దేరగా.. రావొద్దని అక్కడి అధికారులు సమాచారం ఇచ్చారని వివరించారు. సరైన సమయంలోనే గూళ్లను అమ్ముకునే అవకాశం కల్పించాలని కోరారు. ఇలాంటి అంశాలపై ఉన్నతస్థాయిలో సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: