National Highway extension:: కాంట్రాక్టు సంస్థలతో ముందే మాట్లాడి, రింగ్ చేయడం ద్వారా.. పోటీ లేకుండా జాతీయ రహదారి విస్తరణ పనులను దక్కించుకోవాలని చూసిన ఓ కీలక నేత ప్రయత్నాలు ఫలించలేదు. ఆ నేతకు అనుకూలంగా లేని రెండు సంస్థలు బరిలో నిలవడంతో పోటీ తప్పనిసరి అయింది. అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు నుంచి మదనపల్లె వరకు 40 కి.మీ. జాతీయ రహదారి-42ని రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.342 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) గత నెలలో టెండర్లు పిలిచింది.
ఈ టెండర్ల దాఖలు గడువు 3 రోజుల కిందట ముగియగా ఏడు సంస్థలు బిడ్లు వేసినట్లు తేలింది. వాస్తవానికి ఆ ప్రాంతానికి చెందిన ఓ కీలక నేతకు చెందిన సంస్థ ఈ పనులు చేయాలని భావించింది. పక్క జిల్లాకు చెందిన వేరొక సంస్థతో కలిపి పనులు దక్కించుకునేందుకు చూసింది. ఇందులో భాగంగా ఇతర సంస్థలు పోటీకి రాకుండా ముందుగానే మంతనాలు జరిపారు. ఎవరూ బిడ్లు వేయొద్దని చెప్పి రింగ్కు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
అయినా చివరకు రాఘవ కన్స్ట్రక్షన్స్, ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, రిత్విక్ ప్రాజెక్ట్స్, కేసీవీఆర్ ఇన్ఫ్రా, లెకాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఆర్కే ఇన్ఫ్రా.. ఇలా ఏడు సంస్థలు బిడ్లు వేశాయి. వీటిలో 5 సంస్థలు ఆ నేతకు అనుకూలమైనవిగా తెలుస్తోంది. పోటీ ఇవ్వనున్న రెండు సంస్థలు మాత్రం వేర్వేరు పార్టీల నేతలకు చెందినవని సమాచారం. ఈ టెండర్లలో పోటీ ఉండటంతో ధరల బిడ్లలో ఎక్కువగా లెస్కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిసింది.
ఇటీవల కొంత కాలంగా వివిధ జాతీయ రహదారుల పనుల టెండర్లు సగటున 20 శాతానికిపైగా లెస్కు వెళ్లాయి. ఈ టెండరులోనూ అటువంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: