తెదేపా ప్రభుత్వ హయాంలో అడుగడుగునా దోపిడీ జరిగిందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఎంపీ తలారి రంగయ్యతో కలిసి సమావేశం నిర్వహించిన ఆయన... కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లుగా తెదేపా నాయకులు దోచుకున్నారని దుయ్యబట్టారు. ఈఎస్ఐ కుంభకోణంలో వందల కోట్లు అవినీతి అక్రమాలు జరిగాయని అనిశా అధికారులు నిర్ధరించారన్నారు. అందువల్లే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారన్నారు.
అక్రమాలకు పాల్పడిన అచ్చెన్నాయుడుని వెనకేసుకురావటం సిగ్గుచేటన్నారు. తెదేపా నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన వెనుక తెదేపా హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తెదేపా కుట్ర పన్నినట్లు ఆరోపించారు.