అనంతపురం జిల్లా.. ఉద్యాన పంటల సాగుకు ప్రసిద్ధి. ఇక్కడ పండించే పండ్లు, కూరగాయలకు దేశ వ్యాప్తంగా డింమాండ్ ఉంది. కానీ.. అనంత రైతులను కూలీల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పండ్లు, కూరగాయల సాగుచేసిన రైతులకు రోజూ కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. కూలీల ధరలు పెరిగటం, సమయానికి లభ్యత లేకపోవటంవల్ల రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోటానికి ఎదురు చూస్తున్నారు. ఈ ఇబ్బందులను గుర్తించిన ఉద్యానశాఖ బెంగుళూరులోని కిసాన్ సాథి సంస్థ నుంచి డ్రోన్ తెప్పించి పురుగు మందుల పిచికారీపై అవగాహన కల్పిస్తోంది. క్షేత్రస్థాయిలో పలు రకాల ఉద్యాన పంటలపై డ్రోన్తో మందులు చల్లిస్తూ.. అండగా నిలుస్తోంది.
జిల్లాలో అత్యధికంగా మిరప సాగుచేసే ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో కూలీల కొరత మరింత తీవ్రంగా ఉంది. ఎకరాకు రూ.400 చెల్లించినా.. పనికి చాలా మంది ముందుకు రావడం లేదు. పరిస్థితిని గమనించిన జిల్లా ఉద్యానశాఖ అధికారులు... డ్రోన్తో మిరప తోటలపై మందు చల్లే విధానం పై అవగాహన కల్పిస్తున్నారు. ఐదెకరాల మిరప తోటకు మందు చల్లాలంటే ఇద్దరు కూలీలు రోజంతా పనిచేయాల్సి ఉంటుంది. అదే డ్రోన్ ద్వారా అయితే పదిహేను నిమిషాల్లో మందు చల్లుతున్న తీరును చూపించారు.
జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటిలో 40 వేల ఎకరాల వరకు కూరగాయలు, ఐదు వేల ఎకరాల మేర మిరప సాగుచేస్తున్నారు. డ్రోన్తో మందు చల్లటం అన్ని పంటలపై సాధ్యం కాదు. నేలంతా విస్తరించిన మొక్కలున్న పంటలపైనే డ్రోన్తో మందులు పిచికారి చేస్తున్నారు. ఇలాంటి పంటలైతే మందు వృథా కాకుండా, రైతులకు కలిసి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. నేల బురదగా ఉన్నపుడు, పొలంలో తిరిగితే మొక్కల కొమ్మలు విరిగిపోతాయనుకున్నపుడు డ్రోన్తో మందు చల్లటం రైతులకు ప్రయోజనంగా ఉంటుందన్నారు.
దీంతో కూరగాయలు, మిరప సాగుచేస్తున్న రైతులు పూర్తిస్థాయిలో డ్రోన్తో మందులు పిచికారీ చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. రైతులకు మరింత తక్కువ ఛార్జీతో డ్రోన్ సేవలందించేలా ఉద్యానశాఖ అధికారులు కిసాన్ సాథి సంస్థతో సంప్రదింపులు చేస్తున్నారు.
ఇదీ చదవండి: