అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం సిబాబి గ్రామంలో జయన్న అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు వేధింపులే కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
జయన్న విద్యుత్ సబ్స్టేషన్లో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. ఈ సబ్స్టేషన్లో రెండేళ్ల క్రితం చోరీ జరిగినట్లు పోలీసు కేసు నమోదైంది. సంవత్సరం క్రితం విధుల్లో చేరిన జయన్నను పోలీసులు ఈ విషయంపై వేధిస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపించారు. 3 రోజులుగా వేధింపులు అధికమై జయన్నను పోలీసులు కొట్టారని అన్నారు. ఈ పరిణామాలతో అవమానాన్ని భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు. మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా ఆ ప్రాంగణమంతా బంధువుల రోదనలతో ఉద్రిక్తతగా మారింది. తమకు న్యాయం చేయాలని జయన్న మృతదేహంతో బంధువులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.