అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్క రోజు పోలీసు కస్టడీ ముగిసింది. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో ఈ నెల 6న బెయిల్పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని తాడిపత్రిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 7వ తేదీన ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసి కడప కారాగారానికి రిమాండుకు తరలించారు.
ఈ కేసులో ఆయనను విచారించేందుకు పోలీసులు కోర్టును కస్టడీ కోరగా న్యాయమూర్తి ఒక్కరోజు అనుమతి ఇచ్చారు. దీంతో తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని కడప జైలు నుంచి అనంతపురం తీసుకొచ్చారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో న్యాయవాది సమక్షంలో సుమారు 3 గంటలకు పైగా ప్రభాకర్ రెడ్డిని విచారణ చేశారు.
ఈనెల 6వ తేదీన కడప నుంచి తాడిపత్రి వస్తున్న సమయంలో సీఐని ఎందుకు దూషించారని.. మీ వెంట ఎవరెవరు వచ్చారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ సమయం ముగియగా.. ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి తిరిగి కడప జైలుకు తరలించారు.
ఇవీ చదవండి: