అధికార పక్షం నేతలకు పోలీసులు అనకూలంగా వ్యవహరిస్తున్నారని.. అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. రాణిపేట పాఠశాలలోని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లాలని తెలుగుదేశం నాయకులు, ఏజెంట్లను పోలీసులు హెచ్చరించారని.. ఆగ్రహించిన పార్టీ శ్రేణులు రోడ్డుపై నిరసన చేపట్టారు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సహా వైకాపా నాయకులను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించి తమను నిరాకరించడమేంటని.. తెలుగుదేశం నేత కందికుంట వెంకటప్రసాద్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
వైకాపా వారిని కేంద్రంలో కూర్చోబెట్టి మరీ..
వైకాపా నాయకులు తమ ఏజెంట్లను బెదిరించి పోలింగ్ కేంద్రంలో లేకుండా చేశారని మహిళా అభ్యర్ధి రాజేశ్వరి ఆరోపించారు. ప్రశ్నించడానికి వస్తే తన భర్తను అరెస్టు చేశారన్నారు. నగరంలోని 26వ డివిజన్కు సంబంధించి వైకాపా నాయకులు ఆగడాలపై తెదేపా అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తూ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా అభ్యర్థులను పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో కూడా అనుమతించడం లేదని.. వైకాపా వారిని మాత్రం కేంద్రంలో కూర్చోబెట్టి మరి ఎన్నికల నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైకాపా, తెదేపా నాయకుల మధ్య తోపులాట..
వైకాపా నాయకులు కొంతమంది దౌర్జన్యంతో దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా నాయకులు ఆరోపించారు. నగరంలోని 29వ డివిజన్ లో వైకాపా నాయకుల అనుచరులు రెండు మూడు సార్లు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓట్లు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వైకాపా, తెదేపా నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి.. ఇరువురికి సర్ధిచెప్పారు. అనేక చోట్ల వైకాపా నాయకుల దౌర్జన్యాలు అధికమయ్యాయని.. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని తెదేపా అభ్యర్థులు వాపోయారు.
ఇవీ చూడండి...: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు