8తరగతులు.. 90మంది విద్యార్థులు... కానీ!! అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో కొందరు ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లిపోయారు. వారి స్థానంలో ఎవరూ రాలేదు. ప్రస్తుతం ఇద్దరు ఉండగా... ఒకరు ఉన్నత విద్య కోసం దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. మిగిలింది ఒక్కరే. ఉపాధ్యాయులు లేరన్న కారణంతో 120 మంది విద్యార్థుల్లో 30మందికిపైగా టీసీలు తీసుకొని వెళ్లిపోయారు. 8తరగతులకు ప్రస్తుతం ఒకే ఒక్క ఉపాధ్యాయురాలు ఉన్నారు. విద్యార్థులను నియంత్రించుకోవడం కష్టంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణానికి కిలోమీటరు దూరంలో.. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ పాఠశాల అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రహరీ గోడ దెబ్బతింది. మూత్రశాలలు అందుబాటులో లేవు. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లో విష పురుగులు తిరుగుతున్నాయి. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ట్యాంక్ నిర్మాణం కోసం పాఠశాల ముఖద్వారం తలుపు తొలగించారు. ఏడాది గడుస్తున్నా గేటు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా విద్యార్థులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.