40 girls get sick after lunch in AP: వసతి గృహ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 40 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలైన ఘటన అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల వసతి గృహంలో చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తినడం వల్ల 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో రోజు వారీగా మధ్యాహ్న భోజనంతో పప్పు, అన్నంతోపాటు వడలు వడ్డించారని తెలిపారు. అయితే విద్యార్థినులు తీసుకున్న వడల పిండిలో సమస్య ఉండటంతో వసతి గృహంలో 40 మందికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి.
విషయం తెలియగానే వసతి గృహం ఉద్యోగులతో పాటు, స్థానికులు విద్యార్థినులను శింగనమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఎనిమిది మంది విద్యార్థినుల పరిస్థితి విషమించటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. వాంతులు, విరేచనాల ద్వారా శరీరంలో నీరు ఎక్కువగా పోయినందున, విద్యార్థినులంతా చాలా నీరసంగా ఉన్నారని, ఉదయానికి పరిస్థితి చెప్పగలమని వైద్యులు వెల్లడించారు. విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడాలని ఆయా విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: