విజయవాడ నగరంలో సంచలనం రేపిన ఇంజనీరింగ్ విద్యార్ధిని హత్యకేసులో కొత్త కోణాలను వెలుగు చూస్తోంది. ఈ కేసును మాచవరం పోలీసు స్టేషన్ నుంచి విజయవాడ దిశ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. మంగళగిరి చర్చిలో తమ వివాహమైందని నాగేంద్రబాబు చెప్పిన నేపథ్యంలో అక్కడికి ఓ బృందాన్ని, విద్యార్థిని కళాశాలకు మరో బృందాన్ని పంపించారు. కత్తిపోట్ల విశ్లేషణ, ఆమె పోస్టుమార్టం నివేదిక ఇంకా పోలీసులకు అందలేదు. దాడికి పాల్పడిన ఆయుధం పరిమాణాన్ని గమనించిన తర్వాతే కత్తిపోట్ల తీరు విశ్లేషించి తుది నివేదిక అందజేస్తామని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
నాగేంద్రబాబు ఆమె ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు. ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది? అనే అంశాలు తేల్చటం పై పోలీసులు దృష్టి సారించారు. నిందితుడు కోలుకున్న తర్వాత విచారణ ద్వారా సమాచారం రాబట్టాలని చూస్తున్నారు. మరోవైపు విద్యార్థిని, నాగేంద్రబాబుల చరవాణీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని వాట్సాప్ సందేశాలు, సంభాషణల్ని విశ్లేషిస్తున్నారు. కొన్ని ఆడియోలు కూడా బయటకొచ్చాయి. ఈ ఏడాది మార్చి 28 న ఆమె చివరిసారిగా నాగేంద్రబాబుకు కాల్ చేయగా, ఏప్రిల్ 2 న నాగేంద్రబాబు ఆ విద్యార్థినికి కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగేంద్రబాబు చికిత్స పొందుతున్నాడు. ఆ విద్యార్థినితో తనకు 13 ఏళ్లుగా పరిచయం ఉందని నాగేంద్రబాబు తెలిపాడు. ఆమె ఒత్తిడితోనే ఏడాది కిందట.... మంగళగిరిలో పెళ్లి చేసుకున్నామని చెబుతున్నాడు. గత ఏడు నెలలుగా ఆమె తల్లిదండ్రులు తనను దూరం చేశారని... అదే విషయంపై మాట్లాడాలని వాళ్ల ఇంటికి వెళ్లానని అన్నాడు. కాపురానికి వాళ్ల తల్లిదండ్రులు అంగీకరిచటం లేదని... కలిసి ఆత్మహత్య చేసుకుందామని ఆమె తనతో చెప్పిందన్నాడు. అందుకే తాము కత్తితో ఆత్మహత్యకు యత్నించామని నాగేంద్రబాబు తెలిపాడు.
ఇదీ చదవండి: అందుబాటులోకి దుర్గ ఫ్లై ఓవర్... నెరవేరిన నగరవాసుల కల