తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా సాగుతోన్న దొంగ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా నుంచి రూ.7 కోట్ల విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించారు. అమాయకులకు డబ్బు ఆశ చూపి మోసం చేస్తున్నారన్నారు. ఈ ముఠాను నమ్మి చాలా మంది మోసపోయారని సీపీ చెప్పారు. ఈ ముఠా తెలంగాణ, ఏపీ, తమిళనాడులోనూ మోసాలకు పాల్పడిందని ఆయన వెల్లడించారు. ఐదుగురిని అరెస్టు చేశామనీ.. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల నుంచి నగదుతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈ ముఠా కీలక సూత్రధారి పాత నేరస్థుడైన మదార్ మియాగా గుర్తించామని కమిషనర్ ఇక్బాల్ తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనుకునే వాళ్లకు వల వేసి మోసం చేసేవారన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా ఎవరెవరిని మోసం చేశారు? ఎంత మేర మోసం చేశారో విచారించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ ముఠా చేతిలో మోసపోయినవారు ఎవరైనా తమ వద్దకు వస్తే న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని సీపీ విజ్ఞప్తి చేశారు. ఈ నకిలీ నోట్ల ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసు సిబ్బందికి సీపీ అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: ఓ మృగాడి చర్యకు.. ఆ చిన్నారి తల్లైంది...!