యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ గురించి అంతా తెలిసే విదేశీ విద్యార్థులు నేరానికి పాల్పడ్డారని అమెరికా అధికారులు బదులిచ్చారు. ఈ నకిలీ విశ్వవిద్యాలయం వ్యవహారంలో భారత విద్యార్థులు పట్టుబడిన సంగతి తెలిసిందే. భారత దౌత్య అధికారులు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులను సంప్రదించగా ఈ విషయం తేలింది.
" పట్టుబడ్డ 130 మంది విదేశీ విద్యార్థులకు వారు చేస్తున్న నేరం గురించి తెలుసు. ఉన్నత విద్యకోసం నమోదు చేసుకున్న విశ్వవిద్యాలయం నకిలీదనీ వారికి ముందే తెలుసు. అమెరికాలో ఉండాలన్న కోరికతోనే ఈ చర్యకు పాల్పడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్లో ఉపాధ్యాయులు లేరని, తరగతులు జరగవని ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారందరికీ తెలుసు. అన్నీ తెలిసే వారందరూ ఈ నేరంలో భాగస్వాములయ్యారు."
- అమెరికా అధికార ప్రతినిధి
'అమెరికా' ఆశతో వల
విద్యార్థులకు తక్కువ బోధనా రుసుముతో పాటు కళాశాలలో పేరు నమోదుచేసుకున్న వెంటనే చదువుకుంటూ పనిచేసుకునేందుకు అనుమతులను కల్పించింది యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్. దాదాపు 600 మంది విద్యార్థులు ఇందులో చేరగా అందులో ఎక్కవమంది భారతీయులే.
వీరందరినీ విడిపించేందుకు తగిన ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం.
అమెరికాలో అక్రమంగా నివసించేందుకు మోసాలకు పాల్పడిన విదేశీ విద్యార్థులను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) అధికారులు గతవారం అరెస్టు చేశారు. వారిలో కొంత మందిని ఇదివరకే అధికారులు విడుదల చేశారు. 130 మందిలో 129 మంది భారతీయులే.
నేరాన్ని అంగీకరించని నిర్వాహకులు
ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది భారతీయులు తాము ఏ తప్పూ చేయలేదని సమర్థించుకుంటున్నారు. దోషులను మిచిగాన్లోని ఫెడరల్ కోర్టులో హాజరు పరిచారు అమెరికా అధికారులు. అయితే యూనివర్సిటీ నిర్వాహకులు తాము తప్పు చేయలేదని కోర్టుకు సమాధానమిచ్చినట్లు అధికారులు తెలిపారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
అమెరికా అధికారులు గత సోమవారం ఈ ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఒకరు పూచీకత్తుపై బయటికి రాగా, మరో ఏడుగురు జైల్లోనే ఉన్నారు.