ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ అమలులో భాగంగా గుంటూరు జిల్లా పల్నాడు రోడ్డులో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం రాత్రి ఒకటో పట్టణ ఎస్సై వెంకటేశ్వర రావు, సిబ్బందితో కలిసి గస్తీ తిరుగుతుండగా.. పుచ్చకాయల వ్యాపారి నర్సయ్య దుకాణం తీసి ఉంచడాన్ని గుర్తించారు. కర్ఫ్యూ అమల్లో ఉండగా రాత్రి సమయంలో ఎందుకు షాప్ తీశావని పోలీసులు ప్రశ్నించగా.. ఆ వ్యాపారి దురుసుగా ప్రవర్తించాడు. ఫలితంగా విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు వ్యాపారిని పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పినా.. అతడు నిరాకరించాడు. ఆగ్రహించిన పోలీసులు.. ఆ వ్యక్తిపై చేయి చేసుకున్నారు.
బలవంతంగా తరలింపు..
నర్సయ్యను బలవంతంగా ఠాణాకు తరలించారు. ఈ వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. దుకాణం వద్ద జరిగిన గొడవ అంతా సీసీ కెమెరాలో నమోదైంది. శుక్రవారం ఉదయం దుకాణం వద్దకు వచ్చిన వ్యాపారి.. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన వీడియోను ఉన్నతాధికారులకు పంపాడు. ఈ సందర్భంగా స్పందించిన జిల్లా ఎస్పీ, ఎస్సై సహా మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు. ముగ్గురిని వీఆర్కి పంపుతూ ఎస్పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులొచ్చాయని డీఎస్పీ విజయ భాస్కరరావు తెలిపారు.
ఇవీ చూడండి:
కడప జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు.. 10కి చేరిన మృతుల సంఖ్య!