ఈతకు వెళ్లి ఇద్దరు మృతి: వైయస్ఆర్ జిల్లా పులివెందుల యర్రగుడిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. గరండాల వంకలో ఈతకు దిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను జయ (9), తనిస (6)గా పోలీసులు గుర్తించారు.
విద్యుత్షాక్తో వ్యక్తి మృతి: కృష్ణాజిల్లా మోపిదేవి మండలం నాగాయతిప్ప పంచాయతీ శివారు పోచిగానిలంక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అరటితోటలో కూలి పనికి వెళ్లిన తాడేపల్లి నాగేశ్వరరావు (36) అనే వ్యక్తి పైపులో నుంచి వస్తున్న మంచినీళ్లు తాగుతుండగా పైప్ ద్వారా విద్యుత్ ప్రసారం అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో... మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం ఆస్పత్రికి తరలించారు.
గ్రామోత్సవంలో అపశ్రుతి: అన్నమయ్య జిల్లా గాలివీడులో గ్రామోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గంగమ్మ ఉత్సవ విగ్రహం గ్రామోత్సవంలో భాగంగా పల్లకి మోస్తూ సొమ్మసిల్లిపడి శ్రీనివాసులు అనే వ్యక్తి మృతి చెందారు.
ధ్వజస్తంభం మీద పడి... ఇద్దరికి గాయాలు: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠలో అపశ్రుతి జరిగింది. నీలపల్లిలో మీనాక్షి సమేత నీలకంఠేశ్వరస్వామి ఆలయం ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుండగా... ధ్వజస్తంభం మీదపడి ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థిని కాటేసిన పాము: నెల్లూరు జిల్లా కొండాపురం బీసీ హాస్టల్లో పాము కలకలం సృష్టించారు. రాత్రి నిద్రిస్తున్న విద్యార్థి జయరాజ్ను పాము కాటేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జయరాజ్ పదో తరగతి చదువుతున్నాడు.
ఏటీఎం చోరీకి విఫలయత్నం: విశాఖ గాజువాక బీహెచ్పీవీ జంక్షన్లోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం యంత్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భార్యను హత్య చేసిన భర్త... ఎందుకంటే..?: ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చెంచుకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను భర్త రాయితో కొట్టి హత్య చేశాడు.
రెండు వర్గాల మధ్య ఘర్షణ... నలుగురికి గాయాలు: బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం కప్పలవారిపాలెం పంచాయతీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. రామాలయం తిరునాళ్ల ఖర్చుల విషయంలో తలెత్తిన విభేదాలతో గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు.
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో విషాదం జరిగింది. మద్దిపాడు మండలం నేలటూరులో చెరువులో దూకి ప్రసన్నలక్ష్మి(29) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. పదేళ్ల క్రితం ఒంగోలుకు చెందిన వ్యక్తితో ప్రసన్నలక్ష్మి వివాహం జరిగింది. భర్త వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువుల ఆరోపిస్తున్నారు.
తండ్రిని హత్య చేసిన కుమారుడు: గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణం జరిగింది. పొన్నూరులో తండ్రిని కుమారుడు సుత్తితో కొట్టి హత్య చేశాడు. మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని తండ్రి కోటేశ్వరరావు(52)ను కుమారుడు శశిధర్ కుమార్(21) కొట్టి చంపేశాడు.
ఇదీ చదవండి: ఆర్టీసీ బస్సులో నోట్ల కట్టలు.. పోలీసుల అదుపులో ఇద్దరు!