ఇంటి ప్రాంగణంలోని భూమిలో గుప్త నిధులు నిక్షిప్తమై ఉంటే కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంటుందని, నిధులను వెలికి తీస్తామని మాయమాటలు చెప్పి ఓ ముఠా రూ.2.70 లక్షల నగదు అపహరించిన ఘటన సూర్యాపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. సూర్యాపేటలోని గొల్లబజారుకు చెందిన టింగిల్కార్ శ్రీనివాస్ భార్య శ్రీదేవి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆమెను ఆరు నెలల క్రితం హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ కుటుంబ వివరాలు తెలుసుకున్న సుబ్రహ్మణ్యం.. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం గుల్లెపల్లికి చెందిన అక్బర్ఖాన్, అతని రెండో భార్య సల్మాబేగం అలియాస్ లక్ష్మి గురించి తెలిపాడు. క్షుద్రపూజలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దుతారని దొంగ బాబా ముఠా సభ్యులు నమ్మించారు.
ప్రాణాలకే ప్రమాదమంటూ..
ఇంటి ప్రాంగణంలో గుప్త నిధులు నిక్షిప్తమై ఉన్నాయని, ఆ నిధులను వెంటనే తొలగించకపోతే కుటుంబ సభ్యుల ప్రాణాలకే ప్రమాదమని శ్రీనివాస్కు మాయమాటలు చెప్పారు. యాగం చేసి గుప్త నిధులు తొలగించాలంటే రూ.12 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా రూ.2.70 లక్షలు చెల్లించాలని కోరారు. గత ఏడాది సెప్టెంబరు నెలలో సూర్యాపేట గొల్లబజారుకు చేరుకున్న ఈ ముఠా శ్రీనివాస్ ఇంటి మధ్యలో గుంత తవ్వి కొన్ని నకిలీ బంగారు, ఇత్తడి వస్తువులను అందులోంచి తీసినట్లు చూపారు. అదే క్రమంలో యాగం పేరుతో కుటుంబ సభ్యులకు మత్తు మందు కలిపిన కొబ్బరి నీరు ఇచ్చారు. కొబ్బరి నీరు తాగిన కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. అక్కడే పూజలో ఉంచిన రూ.2.70 లక్షలు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించారు.
పరారీలో నిందితులు..
ఆ తర్వాత మోసపోయినట్లు గుర్తించిన బాధితులు వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ముఠాలోని అక్బర్ఖాన్, సల్మాబేగం అలియాస్ లక్ష్మిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్కు చెందిన సుబ్రహ్మణ్యం పరారీలో ఉన్నాడని పట్టణ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మూఢ నమ్మకాలతో ఎవ్వరూ మోసపోవద్దని సూర్యాపేట ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 8.30 గంటలకు ఓటింగ్ శాతం ఎంతంటే..?