విశాఖపట్నం శివారులోని ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుంచి గురువారం తెల్లవారుజామున స్టైరీన్ ఆవిరి భారీఎత్తున గాల్లోకి ఎగసింది. గాఢనిద్రలో ఉన్న ప్రజలు తమకు తెలియకుండానే విషపూరితమైన ఆ ఆవిర్లు పీల్చి నిమిషాల్లోనే అచేతన స్థితికి వెళ్లిపోయారు. కొందరు నిద్రలోనే స్పృహ కోల్పోగా మరికొందరు మెలకువ వచ్చి బయటకు పరుగులు తీశారు. స్టైరీన్ ప్రభావం మరింత పెరిగిపోవడంతో జనం నడుస్తున్న వారు నడుస్తున్నట్లే కుప్పకూలిపోయారు. కొందరు కళ్లు కనపడక నూతుల్లో, మురుగుకాలువల్లో పడిపోయారు. నురగలు కక్కుతూ ప్రాణాలు కోల్పోయినవారు.. కాలూ చేయీ కూడా కదపలేక నిస్సహాయంగా రోడ్డుమీద పడిపోయి సాయం కోసం మూగగా రోదించినవారు.. ఏం జరిగిందో తెలియక, అమ్మా అనడానికి కూడా గొంతు పెగలక కుప్పకూలిపోయిన చిన్నారులు.. రక్తం కక్కుకుంటూ చనిపోయిన పశువులు.. గ్రామమంతా ఎటు చూసినా భీతావహ దృశ్యాలే. హృదయవిదారక సన్నివేశాలే. గుండెల్ని పిండేసిన ఈ దారుణ ఘటనలో 12 మంది మృత్యువాతపడ్డారు. 44 మంది చిన్నారులు సహా 348 మంది ప్రజలు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
సీఎం కోటి రూపాయల పరిహారం ప్రకటన
ప్రమాదం గురించి తెలియగానే పోలీసు, అగ్నిమాపక, విపత్తు నివారణ బృందాలు సంఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టాయి. సుమారు 5వేల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి నేరుగా విశాఖపట్నానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందిస్తామని ఆయన ప్రకటించారు. చికిత్స పొందుతున్న వారికీ తీవ్రతను బట్టి పరిహారం అందజేస్తామన్నారు. స్టైరీన్ను ఇథైల్ బెంజీన్ లేదా వినైల్ బెంజీన్ అని కూడా పిలుస్తారు. దీన్ని 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచాలని, అలా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని సంఘటన దర్యాప్తు చేస్తున్న అధికారులు అభిప్రాయపడుతున్నారు. లాక్డౌన్ కారణంగా స్టైరీన్ 40 రోజులకుపైగా నిల్వ ఉండిపోయిందని, అందువల్లే వేడి అధికమై ట్యాంక్ పైభాగం నుంచి వాయువు లీకైందని పరిశ్రమ యాజమాన్యం చెబుతోంది.
ఏం జరిగిందంటే..
ఎల్.జి.పాలిమర్స్ సంస్థ నుంచి గురువారం తెల్లవారుజామున 2.30, 3 గంటల మధ్య స్టైరీన్ అనే రసాయనానికి సంబంధించిన ఆవిర్లు వెలువడ్డాయి. నిమిషాల్లోనే అవి ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామాన్ని చుట్టుముట్టాయి. దీంతో గాఢనిద్రలో ఉన్నవారికి ఊపిరాడలేదు. ఘాటైన వాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే చాలామంది కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు. కొందరు ద్విచక్రవాహనాలపై దూరంగా వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మోతాదుకు మించి స్టైరీన్ ఆవిర్లను పీల్చడంతో స్పృహ కోల్పోయారు. ఇంకొందరు రోడ్లపైనే చెల్లాచెదురుగా పడిపోయారు. మరికొందరు అడుగు తీసి అడుగు వేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నచోటే కుప్పకూలిపోయారు. కొందరు అతి కష్టం మీద ఓపిక తెచ్చుకుని రక్షించాలంటూ అరుస్తూ విలపించారు.
నిద్రలోనే స్పృహ కోల్పోయారు
వెంకటాపురం గ్రామస్థుల్లో కొందరు స్టైరీన్ ఆవిర్లను నిద్రలోనే పీల్చి అలాగే మత్తులోకి జారుకున్నారు. కొందరికి మెలకువ వచ్చినా అప్పటికే మోతాదుకు మించి స్టైరీన్ ఆవిర్లను పీల్చడంతో ఇళ్లలోనే కదలలేని స్థితిలో పడిపోయారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన పలువురు యువకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి రావాలని కోరారు. దీంతోపాటు పలువురి ఇళ్లకు వెళ్లి తలుపులు బాది వారిని నిద్రలేపారు. గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ అప్రమత్తం చేశారు.
తలుపులు పగలగొట్టి కాపాడారు
పోలీసులు, అగ్నిమాపక, ఇతర శాఖలకు కూడా సమాచారం అందడంతో ఆయా విభాగాల అధికారులు తమ సిబ్బందితో గ్రామానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు (ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్), కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం (సీఐఎస్ఎఫ్) సభ్యులు రంగంలోకి దిగారు. రహదారులపైనా, ఇళ్లలోనూ అచేతనంగా పడి ఉన్న సుమారు 350 మందిని అంబులెన్సుల్లో కేజీహెచ్, సమీపంలోని ప్రభుత్వాసుపత్రులకు, పలు ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది గ్రామంలో రక్షణ చర్యలు చేపట్టే సమయానికి పలువురు ఇళ్లలోనే ఉండి కనీసం ఇంటి తలుపు కూడా తీయలేని నిస్సహాయ స్థితిలో, నిస్సత్తువతో కొట్టుమిట్టాడారు. తెల్లవారుజాము కావడంతో మరుగుదొడ్లకు వెళ్లినవారు అక్కడే కుప్పకూలిపోయారు. ఇలాంటివారందర్నీ తలుపులు బద్దలుకొట్టి ఆసుపత్రులకు తరలించారు. ఆక్సిజన్ అందించి తక్షణ చికిత్స చేయడంతో స్పహ కోల్పోయిన వారిలో చాలామంది ప్రాణాలు నిలబడ్డాయి.
మూగజీవుల మృత్యుఘోష
గ్రామంలో పశువులు, ఇతర మూగజీవాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పశువులను కట్టేసి ఉంచడంతో అవి పారిపోయే అవకాశం కూడా లేక అక్కడే నురగలు కక్కుకుని, రక్తపు వాంతులు చేసుకుని చనిపోయాయి. కుక్కలు కదల్లేక మూలుగుతూ, శ్వాస పీల్చలేక రొప్పుతూ మృత్యుకౌగిలిలోకి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాలు చూసినవారందరినీ కంటతడి పెట్టించాయి. పాములు, ఎలుకలు, తొండలు, బొద్దింకలు ఒకటేమిటి.. గ్రామంలోని జీవజాలమంతా స్టైరీన్ ఆవిర్ల ధాటికి ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలోని కొన్నిచెట్ల ఆకులు తెల్లగా మారిపోగా మరికొన్ని చెట్ల ఆకులు వడిలిపోయాయి.
మతి తప్పి.. ప్రమాదపుటంచుల్లోకి
మరికొందరు ఆవిర్ల ప్రభావానికి తాత్కాలికంగా మతిస్థిమితం కోల్పోయి ఎటు వెళుతున్నారో కూడా తెలియకుండా పరుగుపెట్టారు. అలా పరిగెత్తుతూ వెంకటాపురం గ్రామానికి చెందిన చిన్ని గంగరాజు అనే వ్యక్తి నేల బావిలో పడి మృతి చెందాడు. అదే గ్రామంలో రెండంతస్తుల భవనం పైనుంచి దిగుతూ చంద్రమౌళి అనే వైద్య విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. రక్షించేవారు లేక రక్తపు మడుగులోనే నిస్సహాయంగా ఉండిపోయాడు. తర్వాత ఆసుపత్రికి తరలించినా కాసేపటికే మృత్యువాతపడ్డాడు. రోడ్లపై పడిపోయిన ప్రజలు అపస్మారక స్థితికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన కొందరు మాత్రం అతికష్టం మీద స్టైరీన్ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలను నిలబెట్టుకున్నారు.
మృతుల గుర్తింపులో జాప్యం
మృతుల గుర్తింపులో తీవ్రమైన జాప్యం జరిగింది. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ఇద్దరు చనిపోగా, కేజీహెచ్కు తరలిస్తుండగా కొంతమంది, వచ్చిన తర్వాత కొందరు చనిపోయారు. మృతుల కుటుంబ సభ్యులూ అస్వస్థతకు గురవడంతో శవాల గుర్తింపు పోలీసులకు కష్టసాధ్యమైంది. ఈ కారణంగా రాత్రి పొద్దుపోయే వరకు వివరాలను పోలీసులు ప్రకటించలేకపోయారు. వైద్య విద్యార్థి మృతదేహం గుర్తించడంతో వెంటనే శవపరీక్ష జరిపారు.
గ్యాస్ లీకేజీ దుర్ఘటన క్రమం ఇలా...
తెల్లవారుజామున:
- 2.30 గంటలు: ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ప్రారంభం
- 3.25 గంటలు: అరుణ్కుమార్ అనే వ్యక్తి డయల్ 100కు, విశాఖ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు. కంట్రోల్ రూమ్ గోపాలపట్నం పోలీసులను అప్రమత్తం చేసింది.
- 3.26: గోపాలపట్నం ఎస్సై సత్యనారాయణ సిబ్బందితో కలసి ఆర్ఆర్ వెంకటాపురం బయలుదేరారు.
- 3.35: పోలీసులు గ్రామానికి చేరుకొన్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి మర్రిపాలెం అగ్నిమాపక దళానికి, అంబులెన్సులకు సమాచారం ఇచ్చారు. కంచరపాలెం సీఐ, ఆర్ఐ భగవాన్, గాజువాక ఎస్సై గణేష్ సంఘటనా స్థలానికి చేరుకొన్నారు.
- 3.40: పోలీసులు నిద్రపోతున్న బాధితుల్ని మేల్కొలిపి సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రక్రియ ప్రారంభించారు.
- 3.45: అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకొని ప్రజల్ని అప్రమత్తం చేశారు. 12 రక్షక్, ఆరు 108, నాలుగు హైవే గస్తీ వాహనాలు 3.45 గంటల నుంచి 4 గంటల మధ్య ఆర్ఆర్ వెంకటాపురం, ఆర్.వెంకటాద్రినగర్, ఎస్సీ, బీసీ కాలనీల నుంచి ప్రజల్ని తరలించాయి.
- 4.30: నగర పోలీస్ కమిషనర్, జోన్-2 డీసీపీ తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. గ్యాస్ ప్రభావంతో డీసీపీ ఇబ్బంది పడ్డారు. సహాయ చర్యల్లో పాల్గొన్న ఆర్ఐ టి.భగవాన్, గోపాలపట్నం సీఐ రమణయ్య, ఎస్సై సత్యనారాయణ, కానిస్టేబుల్ నాగరాజు స్టైరీన్ ప్రభావంతో ఆసుపత్రిలో చేరారు. మరో 20 మంది సిబ్బంది స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు.
- 7 గంటలు: ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి.
కారణాలను అన్వేషిస్తున్నాం: ఎల్జీ పాలిమర్స్ ఇండియా
విశాఖపట్నం యూనిట్లో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషిస్తున్నట్లు ఎల్జీ పాలిమర్స్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘మా సాంకేతిక బృందాలకు ఈ పని అప్పగించాం. స్థానికంగా ఉన్న దర్యాప్తు అధికారులతో కలిసి ప్రమాదానికి కారణాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం’’- అని పేర్కొంది. అంతర్జాతీయ సంస్థగా అత్యున్నత పర్యావరణ పరిరక్షణ, భద్రతా ప్రమాణాలకు తాము కట్టుబడి ఉన్నామని వివరించింది.
అదుపులోకి విశాఖ గ్యాస్ లీకేజి: ఎల్జీ
విశాఖలోని పాలిమర్స్ కర్మాగారంలో తలెత్తిన గ్యాస్ లీకేజి పూర్తిగా అదుపులోకి వచ్చిందని దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్ సంస్థ తెలిపింది. ఉద్యోగులకు, స్థానికులకు సాయపడడంలో భారతీయ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఒక ప్రకటన వెలువరించింది. ‘‘లీకేజి నియంత్రణలో ఉంది. కానీ బయటకు వచ్చిన వాయువు వల్ల అక్కడివారికి వికారంగా, తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. అందువల్ల సరైన చికిత్స అందేలా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. ప్లాస్టిక్ను ఉత్పత్తి చేసేందుకు వాడే స్టైరిన్ మోనోమర్ గ్యాస్ లీకేజికి కచ్చితమైన కారణాలు, వాటిల్లిన నష్టంపై విచారణ జరుపుతున్నాం. వాస్తవాలు తెలుసుకునే పనిలో ఉన్నాం. లాక్డౌన్ కారణంగా ఇదివరకే కర్మాగారం కార్యకలాపాలు నిలిపివేశాం.’’ అని సంస్థ వివరించింది.
ఇవీ చదవండి...కళ్లు తెరవక ముందే కమ్మేసింది విషవాయు మేఘం