విశాఖలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)కు రక్షణశాఖ కేటాయించిన రూ.10 వేల కోట్ల భారీ ప్రాజెక్టు పనులు వచ్చే సంవత్సరంలో ప్రారంభం కావడానికి రంగం సిద్ధమైందని ఆ సంస్థ సీఎండీ కమొడోర్ హేమంత్ ఖత్రీ వెల్లడించారు. ఇటీవలే సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
- రక్షణ మంత్రిత్వశాఖ 2016లోనే రూ.10వేల కోట్ల భారీ ప్రాజెక్టును హెచ్ఎస్ఎల్కు కేటాయించింది. ఐదు అత్యాధునిక యుద్ధనౌకలను నిర్మించాలి. వివిధ కారణాలతో ఆ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. అనుమతులు దక్కించుకుని వచ్చే ఏడాదికల్లా పనులు ప్రారంభించాలన్న లక్ష్యంతో చర్యలు చేపడుతున్నాం. ఆలస్యం కారణంగా ప్రాజెక్టు విలువ రూ.14 వేల కోట్లకు పెరిగే అవకాశం ఉంది.
- 79 సంవత్సరాల చరిత్ర ఉన్న హెచ్ఎస్ఎల్కు ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ప్రాజెక్టులు దక్కడంలేదు. దీని నుంచి బయటపడాలంటే సంస్థను ఆర్థికంగా పునర్వ్యవస్థీకరించాలి. రక్షణ మంత్రిత్వశాఖ కూడా హెచ్ఎస్ఎల్ అభివృద్ధికి సుముఖంగా ఉంది.
- నౌకాదళ అధికారిగా 20 ఏళ్లపాటు విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం, విశాఖలోని నౌకాదళ విభాగాల్లో విధులు నిర్వర్తించాను. దీంతో పాటు యుద్ధనౌకల నిర్మాణ పనుల పర్యవేక్షణ, ఇతర కీలక విధుల కోసం మూడేళ్లు ఇటలీలో ఉన్నాను. నాకున్న పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను ఉపయోగించి హెచ్ఎస్ఎల్ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాను.
- సింధుఘోష్ జలాంతర్గామికి పూర్తిస్థాయిలో మరమ్మతు, ఆధునికీకరణ పనులు షిప్యార్డ్కు దక్కే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టుతో జలాంతర్గాముల మరమ్మతులో షిప్యార్డ్ ఆరితేరే అవకాశం కలుగుతుంది.
- దేశంలోని నౌకాశ్రయాలు వినియోగించే టగ్లను దేశంలోనే తయారు చేయాలన్న నిబంధనను కేంద్రం తాజాగా అమలులోకి తెచ్చింది. టగ్ల నిర్మాణంలో హెచ్ఎస్ఎల్కు సుదీర్ఘ అనుభవం ఉంది. దీంతో పెద్దసంఖ్యలో టగ్ల తయారీకి అవకాశాలు వచ్చాయి. 10-50 టన్నుల సామర్థ్యం గల టగ్లనూ ఇక్కడ తయారుచేయగలం. కేంద్ర నిర్ణయంతో ఏటా కనీసం రూ. 100-500 కోట్ల అదనపు ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది.
- సుమారు రూ.2,200 కోట్ల విలువైన రెండు ‘డైవింగ్ సపోర్ట్ వెసల్స్’ (డీఎస్వీలు) నిర్మాణం వచ్చే దసరాకు పూర్తి చేయనున్నాం.
- ప్రస్తుతం రూ.2,495 కోట్ల విలువైన ఆర్డర్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని ఆర్డర్లు వస్తుండటంతో విశాఖ నగరం నౌకా నిర్మాణ కేంద్రంగా మారుతుందనడంలో సందేహం లేదు.
ఇదీచదవండి