ప్రభుత్వమే ఎస్సీ, ఎస్టీలను పోలీస్ స్టేషన్లలో శిరోముండనం చేయించి, కొట్టి చంపేస్తుంటే బయట రక్షణ ఏముంటుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఎస్సీ యువకుడు వరప్రసాద్కి శిరోముండనం, కిరణ్ని పోలీసులు కొట్టి చంపిన రోజే కఠినంగా వ్యవహరించి ఉంటే విశాఖ జిల్లా పెందుర్తిలో మరో ఎస్సీ యువకుడు శ్రీకాంత్కి శిరోముండనంతో అవమానం జరిగి ఉండేది కాదన్నారు. ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. శ్రీకాంత్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎంతటి వారైనా కఠినంగా శిక్షించండి : జవహర్
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు జీవించే హక్కు లేదా అంటూ మాజీ మంత్రి జవహర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్లో ఎస్సీ యువకుడు వరప్రసాద్కి శిరోముండనం చేసిన రోజే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటే మరో శిరోముండనం ఘటన జరిగి ఉండేది కాదన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఎస్సీ యువకుడు శ్రీకాంత్కి శిరోముండనం చేసిన ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. శిరోముండనం వెనుక ఎంతటి పెద్ద వారు ఉన్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వరుసగా ఎస్సీలపై జరుగుతున్న దాడులు, శిరోముండనం, హత్యలపై న్యాయ విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
ఇదీ చదవండి : విశాఖలో దారుణం... ఎస్సీ యువకుడికి శిరోముండనం..!