ఆపత్కాలంలో ప్రజారవాణాకు ఓలా క్యాబ్లకు అనుమతిస్తూ.. రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగరాల్లో అత్యవసర వైద్యసేవలకు ఓలా క్యాబ్లను అనుమతించాలని నిర్ణయించింది. అత్యవసర వైద్య, రవాణా సేవలకు ఓలా క్యాబ్స్ ముందుకొచ్చిందని రవాణాశాఖ వెల్లడించింది. రవాణా, పోలీసుశాఖలు చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయని కరోనా టాస్క్ఫోర్స్ ఇన్ఛార్జి కృష్ణబాబు తెలిపారు. డయాలసిస్, కేన్సర్, గుండెజబ్బు వంటి రోగాలకు ఓలా సేవలందించనుందని చెప్పారు. కరోనా లక్షణాలు లేని రోగులకే ఈ క్యాబ్స్లో రవాణాకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. రోగుల ఇంటి నుంచి ఆస్పత్రికి రాకపోకలకే క్యాబ్ల అనుమతి ఉంటుందని కృష్ణబాబు స్పష్టం చేశారు.
కర్ణాటక వైద్యశాఖతో కలిసి ఓలా ఈ తరహా సేవలు అందిస్తోందని...రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విశాఖలో క్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని టాస్క్ఫోర్స్ ఇన్ఛార్జి తెలిపారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కూడా ఓలా సేవలు వినియోగించుకోవచ్చని..వారికి కూడా ఇళ్లు, ఆస్పత్రి మధ్య రాకపోకలకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఓలా క్యాబ్లో డ్రైవర్ కాకుండా మరో ఇద్దరికే అనుమతి ఉంటుందని... కారులో భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి అని కృష్ణబాబు స్పష్టంచేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీచదవండి