తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న యువతి మౌన పోరాటం ఫలించింది. యువకుడి కుటుంబసభ్యులు వివాహానికి ఒప్పుకోవడం వల్ల రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి.
జిల్లాలోని జన్నారం పట్టణానికి చెందిన లలిత.. వెంకట్రావుపేటకు చెందిన అరుణ్ ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి యువకుడి కుటుంబసభ్యులు నిరాకరించారు. లలిత కుటుంబసభ్యులతో కలిసి అరుణ్ ఇంటి ఎదుట నాలుగు రోజులుగా మౌన పోరాటం చేస్తోంది.
ఈ క్రమంలో మంగళవారం పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేస్తుండగా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. స్థానిక పెద్దమ్మ గుడి వద్ద రెండు కుటుంబాలు, ప్రజాప్రతినిధులు చర్చించి యువకుడి కుటుంబసభ్యులను వివాహానికి ఒప్పించారు. అనంతరం ఇద్దరికి నిశ్చితార్థం చేసి త్వరలోనే వివాహం జరిపిస్తామని హామీ ఇవ్వడం వల్ల యువతి కుటుంబసభ్యులు శాంతించారు.