విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం హుండీల లెక్కింపులో చేతివాటం చూపిన.. ఇంటి దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 9న దేవస్థాన హుండీ లెక్కింపు సమయంలో 4 వేల నగదు, బంగారు వస్తువులను అక్కడే అటెండర్గా పనిచేస్తోన్న పుల్లారావు దొంగిలించారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. పుల్లారావు కదలికలను పసిగట్టి విచారించారు. ఈ క్రమంలో నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. గత నెలలో రెండు సార్లు హుండీల లెక్కింపులో పాల్గొన్న పుల్లారావు.. ఆ సమయంలోనూ చేతి వాటానికి పాల్పడి రూ. 16 వేలు కాజేసినట్లు విచారణలో తేల్చారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణ అవసరమని పశ్చిమ జోన్ డీసీపీ బాబురావు తెలిపారు. నిందితుడుని పట్టుకున్న పోలీసులను కమిషనర్ క్రాంతి రాణా అభినందించారు.
ఏం జరిగిందంటే..: విజయవాడ దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుకలు కాజేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దేవస్థానానికి చెందిన ఓ చిరుద్యోగే ఈ పని చేసినట్టు నిర్ధరించారు. కొద్ది రోజుల కిందట మహామండపం ఆరో అంతస్తులోని బాత్రూంలో ఉన్న బంగారు ఆభరణాల ప్యాకెట్ను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. ఈవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వన్టౌన్ పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 110మంది సేవకులు, ఉద్యోగులు లెక్కింపులో పాల్గొన్నారని తెలిపారు. నిందితుడి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుకలు కాజేసిన వ్యక్తి గుర్తింపు